maharashtra Crisis: మహారాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఉద్వేగ సన్నివేశాలు.. క్షమించాలంటూ ఉద్ధవ్ ఎమోషనల్

By Siva KodatiFirst Published Jun 29, 2022, 7:26 PM IST
Highlights

బుధవారం జరిగిన మహారాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో సీఎం ఉద్ధవ్ థాక్రే ఉద్వేగానికి గురయ్యారు. తన వల్లే తప్పులు జరిగితే క్షమించాలని... అలాగే తనకు అండగా నిలిచినందుకు మంత్రి వర్గ సహచరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

రేపు విశ్వాస పరీక్షకు (maharashtra floor test) గవర్నర్ ఆదేశించిన నేపథ్యంలో బుధవారం జరిగిన మహారాష్ట్ర కేబినెట్ (maharashtra cabinet) సమావేశంలో ఉద్వేగ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ థాక్రే (uddhav thackeray) ఎమోషనల్ అయ్యారు. తన వల్ల తప్పులేమైనా జరిగితే మన్నించాలని కోరారు. తనకు అండగా నిలబడినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఉద్ధవ్. కేబినెట్ సమావేశం తర్వాత సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఉద్ధవ్ థాక్రే మీడియాకు నమస్కరించి వెళ్లిపోయారు. మరోవైపు ఇవాళ్టీ భేటీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని రెండు నగరాల పేర్లును మార్చింది. ఔరంగాబాద్ ను శంభాజీనగర్ గా, ఉస్మానాబాద్ ను ధార్‌శివ్ గా మార్చింది. అలాగే నవీ ముంబై ఎయిర్ పోర్టుకు డీబీ పాటిల్ విమానాశ్రయంగా మార్చుతూ ఉద్ధవ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

మరోవైపు.. రేపు అసెంబ్లీ గవర్నర్ విశ్వాస పరీక్షకు ఆదేశించడంతో శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ ఆదేశాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఉద్ధవ్ వర్గం. సుప్రీంకోర్టు విచారణ తర్వాతే రేపు బలపరీక్ష వుంటుందా లేదా అన్న దానిపై క్లారిటీ రానుంది. అసెంబ్లీలో థాక్రే సర్కార్ తమ మెజారిటీని నిరూపించుకోవాలని రేపు.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించారు గవర్నర్. గురువారం ఉదయం 11 గంటలకు ఈ విశ్వాస పరీక్ష జరగనుంది. 

Also Read:రేపు అసెంబ్లీలో బలపరీక్ష ఎలా సాధ్యమౌతుంది: సుప్రీంలో శివసేన వాదన ఇదీ

ఈ ప్రక్రియను ఎట్టి పరిస్ధితుల్లోనూ సాయంత్రం 5 గంటల్లోగా పూర్తి చేయాలని గవర్నర్ ఆదేశించారు. నిన్న మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ ను కలిసిన తర్వాత ఈ ఆదేశాలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు గౌహతిలో వున్న శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే (eknath shinde)  గోవాకు బయల్దేరారు. శివసేన పార్టీలో 2/3 వంతు ఎమ్మెల్యేల మద్ధతు తనకు వుందని ఆయన అంటున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే సమయానికి గోవా నుంచి ముంబై వచ్చేలా షిండే వర్గం ప్లాన్ చేస్తోంది. 

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలకు గాను ప్రస్తుతం 287 మంది సభ్యులు వున్నారు. అధికార మహా వికాస్ అఘాడీ కూటమిలో ఇంతకుముందు శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్ కు 44 మంది సభ్యుల బలం వుంది. బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు వున్నారు. అయితే రెబల్ ఎమ్మెల్యే షిండే.. తన వెంట 38 మంది శివసేన ఎమ్మెల్యేలు వున్నారని చెబుతున్నారు. దీంతో పాటు పది మంది స్వతంత్రులు కూడా మద్దతు ఇస్తున్నారని అంటున్నారు. 

షిండే వర్గం, స్వతంత్రులు , బీజేపీకి మద్ధతిస్తే వారి బలం 154కి పెరుగుతుంది. అంటే సునాయాసంగా మెజార్టీ మార్క్ అయిన 144ను దాటేస్తుంది. ఇలా కాకుండా మరో వ్యూహాన్ని కూడా షిండే వర్గం అనుసరించే అవకాశం వుంది. శివసేన అసమ్మతి నేతలు 39 మంది సభకు హాజరుకాకపోతే... అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 248కి తగ్గనుంది. అంటే ఉద్ధవ్ థాక్రే తన బలాన్ని నిరూపించుకోవాలంటే 125 మంది సభ్యుల మద్ధతు అవసరం. ప్రస్తుతం మహా వికాస్ అఘాడి సభ్యుల బలం 110 మాత్రమే. ఈ పరీక్షల్లో బలపరీక్ష జరిగితే థాక్రే సర్కార్ కుప్పకూలే ప్రమాదం వుంది. 
 

click me!