
IMD-weather update: దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. వడగాల్పుల తీవ్రత, ఉక్కోపోత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించే విధంగా వాతావరణం మారింది. ఇదే సమయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వారంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో వానలు పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఆరు రాష్ట్రాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది.
వివరాల్లోకెళ్తే.. దేశంలో వడగాల్పులు ముగిశాయనీ, బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయనీ, వాతావరణం మేఘావృతమై ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఉత్తర భారతదేశంలోని ఆరు రాష్ట్రాల్లో వడగండ్ల వానలు, తుఫానులు, మోస్తారు నుంచి భారీ వర్షాలు ప్రభావం ఉంటుందని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు, మూడు రోజుల పాటు కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
"యావత్ భారతావనిలో బుధవారం వడగాల్పులు ముగిశాయి. ఇవాళ్టి నుంచి ఉష్ణోగ్రత తగ్గి మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్ లలో వడగండ్ల వానలు, మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ క్రమంలోనే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాం. మరో రెండు, మూడు రోజుల పాటు కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈస్ట్ ఇండియాలో కూడా తుఫాన్లు వచ్చే అవకాశం ఉంది" అని ఐఎండీ శాస్త్రవేత్త ఆర్కే జేనమణి తెలిపారు.
రానున్న 24 గంటల్లో ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాగల 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గడంతో మే 27న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ఐఎండీ భువనేశ్వర్ డైరెక్టర్ హెచ్ ఆర్ బిశ్వాస్ తెలిపారు. దేశ రాజధానితో పాటు పరిసర ప్రాంతాలు గత కొన్ని రోజులుగా మండుతున్న ఎండలతో అల్లాడిపోతున్నాయి. సోమవారం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును కూడా దాటాయి. మంగళవారం ఉదయం సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా 29.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వడగాలులు తీవ్రంగా వీయడంతో విద్యుత్ గ్రిడ్లు దెబ్బతిన్న పరిస్థితులు ఉన్నాయి. అయితే, నేటి నుంచి వర్షాలు కొంత ఉపశమనం కలిగించే వరకు వడగాలుల పరిస్థితులు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది.