కేరళలో 27 ఏళ్ల యువకుడి పరువు హత్య...

By AN TeluguFirst Published Dec 26, 2020, 12:53 PM IST
Highlights

తమకు ఇష్టం లేకుండా తమ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో అల్లుడని కూడా చూడకుండా వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కేరళలోచోటుచేసుకుంది. పాలక్కడ్ జిల్లాలో ని తెన్కురిస్సి ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈ హత్య జరిగింది. 

తమకు ఇష్టం లేకుండా తమ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో అల్లుడని కూడా చూడకుండా వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కేరళలోచోటుచేసుకుంది. పాలక్కడ్ జిల్లాలో ని తెన్కురిస్సి ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈ హత్య జరిగింది. 

తెన్కురిస్సికి చెందిన 27 ఏళ్ల అనీష్‌  అదే ప్రాంతానికి చెందిన ఓయువతిని ప్రేమించాడు. యువతి తండ్రి ప్రభుకుమార్‌ ఆ ప్రాంతంలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. దీంతో అనీష్ తన కూతురిని ప్రేమించడం నచ్చలేదు. ఆమెను ప్రేమించడానికి వీలేదని అనీష్‌ను చాలాసార్లు హెచ్చరించాడు. 
ఇదిలా ఉంటే సదరు యువతి కూడా అనీష్‌ను ఇష్టపడింది. దీంతో పెళ్లికి ఎలాగూ ఒప్పుకోరని  మూడు నెలల క్రితం వారిద్దరు పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. అనీష్‌ పెళ్లి ఇరు కుటుంబాల మధ్య చిచ్చు రేపి గొడవలకు దారి తీసింది. 

దీంతో అనీష్‌ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చారు. అయితే యువతి కుటుంబసభ్యులు రాజీకి అంగీకరించినా అనీష్‌ దంపతులను మాత్రం చంపుతామని బెదిరించేవారు. అప్పటినుంచి అనీష్‌ దంపతులు ఇరు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. 

కాగా శుక్రవారం సాయంత్రం  అనీష్ ఆఫీస్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా యువతి తండ్రి ప్రభు కుమార్‌, ఆమె మేనమామ సురేశ్‌లు అతన్ని అడ్డుకున్నారు. అతనిపై పదునైన ఆయుధాలతో దాడి చేసి అక్కడినుంచి పారిపోయారు. 

రక్తపు మడుగులో పడి ఉన్న అనీష్‌ను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఆసుపత్రికి చేరేలోగానే అనీష్‌ ప్రాణాలు విడిచాడు. అనీష్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె తండ్రి ప్రభు కుమార్‌, మేనమామ సురేశ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

click me!