
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అతిషి మర్లేనా చేసిన ప్రకటనను కేరళ విద్యా శాఖ మంత్రి వి శివన్కుట్టి తీవ్రంగా ఖండించారు. ఆమె చేసిన ప్రకటనలో వాస్తవం లేదని చెప్పిన వీ శివన్కుట్టి.. దానిని కొట్టిపారేశారు. వివరాలు.. కల్కాజీలోని మా పాఠశాలలో కేరళ అధికారులకు ఆతిథ్యం ఇవ్వడం చాలా అద్భుతంగా ఉందని ఆప్ ఎమ్మెల్యే అతిషి ట్వీట్ చేశారు. ‘‘మా విద్యా విధానాన్ని అర్థం చేసుకుని వారి రాష్ట్రంలో అమలు చేయాలని కేరళ అధికారులు ఆసక్తిగా ఉన్నారు. ఇది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం యొక్క దేశ నిర్మాణ ఆలోచన’’ అని అతిషి పేర్కొన్నారు.
అంతేకాకుండా పలు ఫొటోలను కూడా షేర్ చేశారు. అందులో ఢిల్లీలోని ఒక పాఠశాలలో ఆమె పాటు నలుగురు వ్యక్తులు ఉన్నారు. వారు పాఠశాలలోని విద్యార్థులతో కూడా మాట్లాడారు. ఈ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా.. ఢిల్లీ మోడల్ అర్థం చేసుకునేందుకు కేరళ అధికారులు వచ్చారని అతిషి పేర్కొన్నట్టు అయింది.
అయితే అతిషి ప్రకటనను కేరళ విద్యా శాఖ మంత్రి శివన్ కుట్టి ఖండించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఢిల్లీ మోడల్ గురించి తెలుసుకోవడాని కేరళ విద్యా శాఖ ఏ అధికారిని పంపలేదని వెల్లడించారు. గత నెలలో కేరళ మోడల్ను అధ్యయనం చేయడానికి ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులకు అన్ని విధాలుగా సహాయం అందించబడిందని చెప్పారు. అయితే ఆప్ ఎమ్మెల్యే అతిషి ఆతిథ్యం ఇచ్చిన అధికారులు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు.