
బీజేపీ నేత నవీన్ కుమార్ జిందాల్పై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేసిన ఒక రోజు తరువాత పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్ వర్మ స్పందించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను తీవ్రంగా విమర్శించారు. దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ కేజ్రీవాల్ మర్చిపోకూడదని అన్నారు.
“ మేము అనుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు అయిన తరువాత వారి నాయకులపై కూడా కేసులు నమోదు చేయొచ్చు. మేము ఇలాంటి చర్యలే తీసుకోవాలనుకుంటే దేశంలో సగానికిపైగా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. అక్కడి నుంచి మేము కేజ్రీవాలపై చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇలాంటి లో లెవల్ రాజకీయాలపై మాకు నమ్మకం లేదు ’’ అని పర్వేశ్ వర్మ చెప్పారు.
ఢిల్లీ బీజేపీ స్పోక్స్పర్సన్ నవీన్ కుమార్ జిందాల్ పై పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయవాది ఫిర్యాదుతో ఆ రాష్ట్ర పోలీసులు మొహలీలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ నేత తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించి వక్రీకరించిన వీడియో క్లిప్ను షేర్ చేశారని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని తప్పుడు అర్థం వచ్చేలా వీడియోను మార్పులు చేర్పులు చేశారని ఆరోపించారు. వాస్తవంగా ఆయన ఉద్దేశాలను వెల్లడిస్తూ మాట్లాడిన మాటలకు, ఆ వీడియో క్లిప్లోని మాటలకు మధ్య పొంతన లేదని పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఆ ఇంటర్వ్యూలో స్వచ్ఛమైన, పారదర్శకమైన ప్రభుత్వాన్ని తేవడంపై చేస్తున్న వ్యాఖ్యలను ఈ వీడియో క్లిప్లో వక్రీకరించారని ఆరోపించారు. కాగా పంజాబ్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ రాష్ట్రానికి చెందని బీజేపీ నేతపై నమోదైన మూడో ఎఫ్ఐఆర్ ఇది.
దీనికి ముందు కశ్మీర్ ఫైల్స్పై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ అధికార ప్రతినిధి తజిందర్ బగ్గా చేసిన ప్రకటనపై కూడా పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో తజిందర్ బగ్గా రెచ్చగొట్టే ప్రకటన చేశారని, మతపరమైన శత్రుత్వాన్ని ప్రోత్సహించేలా, నేరపూరిత బెదిరింపులు చేశారనే ఆరోపణలతో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. AAP పంజాబ్ అధికార ప్రతినిధి, లోక్సభ ఇన్ఛార్జ్ సన్నీ సింగ్ అహ్లువాలియా ఫిర్యాదు మేరకు మొహాలీలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో బగ్గా, కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులపై FIR నమోదు చేశారు.
ఈ పరిణామాలపై బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ మాట్లాడారు. పంజాబ్ పోలీసులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే జిందాల్ ఇంటికి చేరుకున్నారని ఆరోపించారు. “ పంజాబ్ పోలీసులు సమాచారం లేకుండానే నవీన్ జిందాల్ ఇంటికి చేరుకున్నారు. మా పార్టీ యువమోర్చా కార్యదర్శి బగ్గా విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ఈ అధికార దుర్వినియోగాన్ని మేము ఎప్పటికీ సహించము. ఇది ఆపకపోతే మేము కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తాము” అని ఆయన అన్నారు.