
Extremely Heavy Rain Alert: దేశంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక చోట్ల వరదలు ముంచెత్తడంతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. లక్షలాది మంది ముంపు ప్రాంతాల్లో ఉన్నారని పలు రాష్ట్రాల నుంచి అందుతున్న రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక కర్నాటకలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మరిన్ని గంటల్లో రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కోస్తా కర్నాటకలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. మంగళూరులో వర్షం కారణంగా ఒకరు మృతి చెందారు. సంబంధిత ప్రాంతాల్లోని నివాసితులను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తరలించాల్సిన అవసరం ఉందా లేదా అని అంచనా వేయడానికి వరద ముంపు ప్రాంతాలపై సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధికారులను ఆదేశించినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
"2009లో భారీ వరదల తర్వాత 60 గ్రామాలు శాశ్వతంగా పునరావాసం పొందాయి. కానీ వరద నీరు తగ్గిన తర్వాత ప్రజలు తమ పూర్వ నివాసాలకు తిరిగి వచ్చారు. నదీ తీరాలు, లోతట్టు ప్రాంతాలలో ఎత్తైన ప్రదేశాలలో సుసంపన్నమైన పునరావాస కేంద్రాలను నిర్మించే ఎంపికను మేము పరిశీలిస్తున్నాము. తద్వారా వరదల వల్ల ప్రజలు ప్రభావితమైనప్పుడల్లా అక్కడికి తరలించవచ్చు”అని ఆయన అన్నారు. బాధిత జిల్లాల డిప్యూటీ కమీషనర్లను తక్షణమే రెస్క్యూ, రిలీఫ్ పనులు చేపట్టాలని ఆదేశించామని బొమ్మై తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా కర్నాటకలోని తీరప్రాంతాలు, మల్నాడు ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాల వల్ల ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లు, భవనాలు, విద్యుత్ స్తంభాలు, ఆస్తులకు నష్టం వాటిల్లింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేల ఎకరాల్లో పంటపొలాలు నీట మునిగాయి.
"నేను వర్ష ప్రభావిత జిల్లాల డిప్యూటీ కమిషనర్లతో చర్చించాను. ఇప్పటికే రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. అత్యవసరంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశాం. భారీ కురుస్తున్న వానలు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కోస్తా జిల్లాలు, కొడగులో ఇళ్ళు, ఆస్తులు దెబ్బతిన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి" అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బుధవారం చెప్పారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్లను మోహరించాలని ఆయన ఆదేశించారు. ఇదిలావుండగా, రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుతు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. అలాగే, హిమాచల్ ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నాడు ఆకస్మిక వరదల కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారనీ, పలువురు గల్లంతయ్యారని మీడియి రిపోర్టులు పేర్కొన్నాయి.