
Karnataka Hubli riots: కర్నాటకలో చోటుచేసుకున్న హుబ్లీ అల్లర్ల నిందితుల్లో ఒకరైన మహ్మద్ ఆరిఫ్ జైలులోనే ఆత్మహత్యకు యత్నించాడు. అతను జైలులో టర్పెంటైన్ తాగినట్లు సమాచారం. వెంటనే గుర్తించిన జైలు అధికారులు నిందితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నాడని పోలీసులు తెలిపారు.
కాగా, ఓల్డ్ హుబ్లీ పోలీస్ స్టేషన్లో రాళ్ల దాడి ఘటనకు సంబంధించి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) కార్పొరేటర్ నజీర్ అహ్మద్ హోన్యాల్ను వారం క్రితం పోలీసులు అరెస్టు చేశారు. అనితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 16న అర్ధరాత్రి హుబ్లీ పోలీస్ స్టేషన్పై 1,000 మంది గుంపు దాడికి ప్రయత్నించింది. పోలీసు స్టేషన్పై గుంపు రాళ్లు రువ్వడంతో ఈ ఘటనలో 12 మంది పోలీసులు గాయపడ్డారు. ముందుగా పక్కాగా దాడికి యత్నించిన నిందితులు అర్ధరాత్రి సమయంలో రాళ్లు, కర్రలతో పోలీస్ స్టేషన్ పై దాడి చేసి స్టేషన్ లోని సామాగ్రిని ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన పోలీస్ సిబ్బందిపైనా దాడికి పాల్పడ్డారు. దీంతో దుండగులపై టియర్ గ్యాస్, లాఠీ ఛార్జ్ ప్రయోగించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈఘటనలో మొత్తం 12 మంది పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
ధార్వాడ్ పోలీస్ కమిషనర్ లాబు రామ్ ఈ ఘటనపై మాట్లాడుతూ..స్టేషన్ పై దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఒక వర్గాన్ని ఉద్దేశిస్తూ ఓ యువకుడు సోషల్ మీడియాలో వివాదాస్పదమైన పోస్ట్ పెట్టడంతో ఈ అసలు గొడవ షురు అయింది. యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో.. కేసు నమోదుచేసుకుని ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, యువకుడిపై తీసుకున్న చర్యలు సరిపోవంటూ ఇంకో వర్గం ఆందోళనకు దిగింది. ఈ క్రమంలోనే పోలీసు స్టేషన్ పై దాడి చేసేంత వరకు వెళ్లింది.