
Karnataka Congress: కర్నాటకలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మృతి ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. అధికార బీజేపీ-ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరదీసింది. గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్పతో సంబంధం ఉన్న కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మృతిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించి.. అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్నాటక కాంగ్రెస్ నేతలు, ఇతర ప్రతిపక్ష నేతలు కలిసి గురువారం నాడు ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మృతికి సంబంధించి కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్పను తొలగించాలని డిమాండ్ చేస్తూ సీఎం బసవరాజ్ బొమ్మై నివాసం వద్దకు ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్, సిద్ధరామయ్య తదితరులను బెంగళూరు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) చీఫ్ డీకే. శివకుమార్, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు సంబంధించి కర్నాటక మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేయాలనే డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సిఎం బొమ్మై నివాసం వైపు నిరసనకు దిగి.. ర్యాలీగా వెళ్లారు. అయితే, వీరిని పోలీసులు అడ్డగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను అడ్డగించి.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్ష నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇంటి ముంట్టడికి ముందు డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి మంత్రిని రక్షించాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని ఆరోపించారు. "అతను భారతీయ జనతా పార్టీ (బీజేపీ), అతని ప్రభుత్వ పరువును కాపాడాలనుకుంటే, తక్షణమే మంత్రి కేఎస్ ఈశ్వరప్పను మంత్రి వర్గం నుంచి తొలగించి.. అరెస్టు చేయాలి" అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సూర్జేవాలా ట్వీట్ చేస్తూ.. మంత్రి ఈశ్వరప్పను అరెస్టు చేయడానికి బదులు.. బొమ్మై ప్రభుత్వం మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, తనతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసింది. బాబాసాహెబ్ జయంతి రోజున ఇలాంటి అణిచివేత చర్యలతో అవినీతికి మూత పెట్టలేము అంటూ పేర్కొన్నారు.
కర్నాటకలోని అధికార బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు గుప్పించిన సుర్జేవాలా.. సంతోష్ పాటిల్కు న్యాయం చేయడం ప్రతి కన్నడిగుడి ధ్యేయమని, రాష్ట్ర రాజకీయాల నుండి ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రజలు ఈ యజ్ఞంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈశ్వరప్పను అరెస్టు చేసి తొలగించే వరకు తాము విశ్రమించబోయేది లేదన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి రణ్దీప్ సూర్జేవాలాతో సహా అగ్రనేతల ప్రతినిధి బృందం ఈశ్వరప్పను తొలగించాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ను కలిశారు. ఈశ్వరప్పపై అవినీతి, మోసం ఆరోపణలు చేసిన కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఉడిపిలో మంగళవారం నాడు శవమై కనిపించాడు. మృతుడు సంతోష్ గతంలో మంత్రి ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ డిమాండ్పై ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర బీజేపీ నాయకత్వానికి లేఖలు రాశారు.