
Hizbul terrorists arrest : జమ్మూకాశ్మీర్ విభజన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉగ్రవాదా చర్యలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే, ఇటీవల మళ్లీ ఉగ్రకార్యకలాపాలు మొదలయ్యాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. పాకిస్థాన్ సరిహద్దుల నుంచి దేశంలోకి పెద్దఎత్తున ఉగ్రవాదులు చోరబడటంతో పాడు పెద్ద ఎత్తున దాడులు జరిగే అవకాశముందని రిపోర్టుల అంచనాల పేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఇక ప్రస్తుతం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల ఒక వర్గాన్ని హెచ్చరిస్తూ ఉగ్రవాదులు ప్రకటనలు వెలువడటం కలకలం రేపింది. 1990ల తర్వాత మళ్లీ ఒక వర్గాన్ని హెచ్చరిస్తూ ఉగ్రవాదులు ఇలా ప్రకటించడం ఇది రెండోసారి.
ఈ క్రమంలోనే గత రెండేళ్లుగా మారువేషంలో జీవిస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని గుర్తించి అరెస్టు చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కర్నాటకలో ఇప్పటికే హిందూ-ముస్లింలక సంబంధించిన పలు వివాదాలు వరుసగా చోటుచేసుకోవడంతో పాటు ఇలాంటి ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్న తరుణంలో ఉగ్రవాదులను అరెస్టు చేయడంతో రాష్ట్ర అధికారులు అప్రమత్తం అయ్యారు. రాష్ట్రం సున్నితమైన దశగా.. అశాంతి లాంటి పరిస్థితిని దాటుతోంది కాబట్టి, ముఖ్యంగా హిజాబ్ వివాదం.. మసీదు-ఆలయ సమస్య తర్వాత ఉగ్రవాది అరెస్టు అంశంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలో పోలీసులు హై అలర్ట్ లో ఉన్నారు. సంబంధిత మూలాల ప్రకారం, స్థానిక బెంగళూరు పోలీసుల సహాయంతో రాష్ట్రీయ రైఫిల్స్ (RR) మరియు సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ప్లాటూన్లు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి.
3న ఆపరేషన్ నిర్వహించగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాది గత రెండేళ్లుగా బెంగళూరులో తలదాచుకున్నాడు. అరెస్టయిన ఉగ్రవాదిని హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక వ్యక్తుల్లో ఒకరైన తాలిబ్ హుస్సేన్గా గుర్తించారు. ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ మీడియాకు ధృవీకరించారు. తాలిబ్ హుస్సేన్ నాగసేని తహసీల్లోని కిష్త్వార్ జిల్లాకు చెందినవాడు. అతను 2016లో ఉగ్రవాద సంస్థలో చేరాడు, అతనికి ఇద్దరు భార్యలు మరియు ఐదుగురు పిల్లలు ఉన్నారు. తాలిబ్ యువకులను బ్రెయిన్ వాష్ చేసేవాడు మరియు జమ్మూ కాశ్మీర్ లోయలోని హిందువులను లక్ష్యంగా చేసుకునేవాడు. అతను అనేక బాంబు పేలుళ్ల సంఘటనలలో కూడా పాల్గొన్నాడు. సాయుధ బలగాలు అతని కోసం వేట ముమ్మరం చేయడంతో, అతను బెంగళూరుకు వచ్చి తలదాచుకున్నాడు.
అతను తన భార్య మరియు పిల్లలలో ఒకరితో బెంగళూరు వచ్చాడు. ఆటో నడుపుతూ సాధారణ మనిషిగా జీవనం సాగిస్తున్నాడు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సాయుధ బలగాలు తాలిబ్ హుస్సేన్ బెంగళూరులో ఉన్నట్లు సమాచారం సేకరించగలిగాయి. ఈ విషయమై సాయుధ దళాల ప్రత్యేక బృందం గత వారం బెంగళూరు పోలీసు కమిషనర్ను కలిసింది. అతని కదలికలపై స్థానిక పోలీసులు నిఘా ఉంచి బలగాలకు సమాచారం అందించారు. అరెస్ట్ తర్వాత అతడు ఉగ్రవాది అని తెలిసి ఇరుగుపొరుగు వారు షాక్ అయ్యారు. ఉగ్రవాది ఇక్కడ సాధారణ వ్యక్తిలా ప్రశాంత జీవనం గడిపాడు.