
ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న దంపతులను కన్నడ నటుడు నాగభూషణ తన కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో వారిద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే హాస్పిటల్ కు తరలించేలోపే భార్య మరణించింది. భర్త ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు కారణమైన నాగభూషణంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాలు ఇలా ఉన్నాయి. నటుడు నాగభూషణ శనివారం రాత్రి తన కారులో ఉత్తరహళ్లి నుంచి కోననకుంట వైపు సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే కారు రాత్రి 9.45 గంటల సమయంలో వసంత పుర ప్రధాన రహదారి వద్దకు చేరుకుంది. ఆ సమయంలో 58 ఏళ్ల కృష్ణ, 48 ఏళ్ల ప్రేమ దంపతులు అక్కడి ఫుత్ పాత్ పై నడుస్తున్నారు. అయితే నాగభూషణ డ్రైవ్ చేస్తున్న కారు ఆ భార్యాభర్తలను ఢీకొట్టింది. తరువాత ఓ కరెంట్ పోల్ ను ఢీకొట్టి ఆగిపోయింది.
ఈ ఘటనలో వారిద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే నటుడు తేరుకొని వారిద్దరనీ స్వయంగా హాస్పిటల్ కు తరలించారు. కానీ హాస్పిటల్ కు చేరుకునే లోపే పరిస్థితి విషమించడంతో ప్రేమ మరణించారు. కృష్ణకు రెండు కాళ్లు, తల, కడుపుకు గాయాలయ్యాయి. ఆయన ప్రస్తుతం ట్రీట్ మెంట్ పొందుతున్నారు.
ఈ ప్రమాదంపై బెంగళూరులోని కుమారస్వామి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద నటుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. నాగభూషణం ఇక్కత్ (2021), బాదవ రాస్కెల్ (2021), హనీమూన్ (2022) వంటి చిత్రాల్లో నటించారు. ఇటీవల విడులైన 'తగరు పల్లయ' చిత్రంలో కూడా ఆయన కనిపించారు.