ఇండిగో విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్రయాణికుడు.. విచారణకు ఆదేశించిన డీజీసీఏ..

By Sumanth KanukulaFirst Published Jan 17, 2023, 4:18 PM IST
Highlights

ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచాడు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది.

ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచాడు. 2022 డిసెంబర్‌ 10వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ప్రయాణికుడి చర్య.. విమానంలోని తోటి ప్రయాణీకుల్లో భయాందోళనలకు కారణమైంది. వివరాలు.. డిసెంబర్ 10వ తేదీన ఇండిగో విమానం  6E-7339 చెన్నై నుంచి త్రివేండ్రం వెళుతోంది. అయితే అందులో ఒక ప్రయాణీకుడు ఎమర్జెన్సీ డోర్ తెరియడంతో మిగిలిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు  చెందారు. దీంతో విమాన సిబ్బంది, అధికారులు.. తీవ్ర ఒత్తిడిలో తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత విమానం బయలుదేరింది. ఇక, ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

‘‘2022 డిసెంబర్ 10న చెన్నై నుండి త్రివేండ్రం వెళ్లే ఇండిగో 6E ఫ్లైట్ 6E-7339లో ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. ప్రెషరైజేషన్ తనిఖీల తర్వాత విమానం బయలుదేరింది. ఈ సంఘటన ప్రయాణీకులలో భయాందోళనలను సృష్టించింది. భద్రతా తనిఖీ తర్వాత విమానం బయలుదేరింది’’ అని డీజీసీఏ అధికారి చెప్పారు. 


ఇదిలా ఉంటే.. శంకర్ మిశ్రా అనే వ్యక్తి గత ఏడాది నవంబర్ 26న ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో మత్తులో 70 ఏళ్ల మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటన సంచలనంగా మారింది. ఎయిర్ ఇండియాకు మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు జనవరి 4న అతనిపై ఐపీసీ సెక్షన్‌లు 354, 509, 510, ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ చట్టంలోని సెక్షన్ 23 కింద అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.  ఈ ఘటన అనంతరం తన ఉద్యోగి శంకర్ మిశ్రాను అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గో కూడా తొలగించింది.

click me!