
IndiGo CEO Resign : భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో విమానయాన రంగంలో గందరగోళానికి కారణమైన ఈ సంస్థలో ప్రక్షాళన మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ ఎయిర్ లైన్స్ సీఈఓ పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీ ఇవాళ (మార్చి 10, మంగళవారం) అధికారికంగా ప్రకటించింది.
గతేడాది డిసెంబర్లో ఇండిగో సంస్థ తన చరిత్రలోనే అత్యంత దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో విమానాలు భారీగా ఆలస్యం అవ్వడం, రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే చిక్కుకుపోయారు. ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించడంతో కంపెనీపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు సీఈఓ రాజీనామా చేయడం గమనార్హం.
సీఈవో పీటర్ ఎల్బర్స్ అకస్మాత్తుగా రాజీనామా ప్రకటించింది అతడు ముందుగానే ఇండిగోో సంస్థకు సమాచారం అందించినట్లున్నాడు. అందుకే అతడి రాజీనామాతో పాటు తాత్కాలిక సీఈవో ప్రకటన ఒకేసారి వెలువడ్డాయి. పీటర్ స్థానంలో రాహుల్ భాటియాను తాత్కాలిక సీఈఓగా నియమించింది ఇండిగో. ప్రస్తుతం ఈయన ఇండిగో సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
పీటర్ ఎల్బర్స్ తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలు చూపించారు. కానీ గత ఏడాది డిసెంబర్ లో చోటుచేసుకున్న పరిణామాలే కారణమై ఉంటుందని చర్చ సాగుతోంది. ఏదేమైనా పీటర్స్ రాజీనామాను ఇండిగో బోర్డు కూడా వెంటనే ఆమోదించింది. 2022లో ఇండిగో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన పీటర్ సేవలకు కంపెనీ ధన్యవాదాలు తెలిపింది.