
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై యుద్ధం కారణంగా అమెరికా సహా యూరప్ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఆ దేశాల నుంచి రష్యాకు వెళ్లే ఎగుమతులను నిలిపేశాయి. ఈ నేపథ్యంలోనే రష్యా ప్రభుత్వం దాని సన్నిహిత దేశాలతో ఒప్పందాలు పెట్టుకుంటున్నది. అమెరికా డాలర్లలో కాకుండా ఆ రెండు దేశాల మధ్య వాటి సొంత కరెన్సీ ద్వారా ఇచ్చిపుచ్చుకునే మెకానిజానికి శ్రీకారం చుట్టాయి. అంతర్జాతీయ విపణిలో మంటలు మండుతున్న ఇంధనాన్ని చౌకగా ఎగుమతి చేసే ఆఫర్ ఇవ్వడంతో చాలా దేశాలు కాదనడం లేదు. ఈ తరుణంలోనే భారత్ కూడా రష్యా నుంచి చౌకగా ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే, అదే తరుణంలో ఆంక్షల కారణంగా రష్యా పొందలేకపోతున్న సరుకులను భారత్ ఎగుమతి చేసే డీల్ కూడా చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే రెండు బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన సరుకులను ఎగుమతి చేయడానికి భారత్ రంగం సిద్ధం చేస్తున్నది.
రష్యా మార్కెట్లో భారత సరుకులను, ఉత్పత్తుల ప్రవేశానికి అనుకూలమైన మార్పులు, సరళీకరణలు చేయాలని భారత ప్రభుత్వం రష్యాను అడిగినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. రెండు దేశాల మధ్య ఎగుమతి, దిగుమతుల్లో పెద్దగా మార్పు రాకుండా ఈ సరఫరాలు సాగే అవకాశాలు ఉన్నాయి. నికరంగా భారత్ దిగుమతిదారుగానే తేలేలా ఈ నిర్ణయాలు ఉండే అవకాశాలు ఉన్నట్టు కొన్ని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.
ఫార్మా ఉత్పత్తులు, ప్లాస్టిక్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమికల్స్, హోమ్ ఫర్నిషింగ్స్, రైస్, టీ కాఫీ వంటి బేవరేజెస్, పాల ఉత్పత్తులు, ఇతర సరుకులను భారత్ రష్యాకు దిగుమతి చేయనున్నట్టు తెలుస్తున్నది. రష్యా దిగుమతి చేసుకోవాలనుకుంటున్న టాప్ 20 ఉత్పత్తుల్లో చాలా వరకు భారత్ ఆ దేశానికి ఎగుమతి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. మెరైన్ ప్రాడక్ట్స్, అప్పారెల్స్, టెక్స్టైల్స్, ఫుట్ వేర్, మెషీనరీ, ఎలక్ట్రానిక్స్ వంటివి కీలకంగా ఈ జాబితాలో ఉన్నాయి.
ప్రస్తుతం రష్యాకు భారత్ ఎగుమతులు చాలా స్వల్పంగానే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే రష్యాకు భారత్ 68 బిలియన్ డాలర్ల ఎగుమతి చేస్తుండగా.. రష్యాకు మాత్రం కేవలం 3 బిలియన్ డాలర్ల ఎగుమతులు మాత్రమే చేస్తున్నది.
ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్తో భేటీ కావడం చాలా దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటీవలి కాలంలో చాలా దేశాల మంత్రులు భారత్ పర్యటించారు. కానీ, మోడీ వారితో భేటీ కాలేదు. యూకే ఫారీన్ మినిస్టర్ లిజ్ ట్రస్ ఇప్పటికే ఇండియాలో ఉన్నప్పటికీ ఆయనతో ప్రధాని సమావేశం కాలేదు. ఒక వారం క్రితం భారత్ పర్యటించిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ పర్యటించారు. ప్రధాని మోడీతో భేటీ కావడానికి అపాయింట్మెంట్ అడిగారు. కానీ, మోడీ తిరస్కరించారు. దీంతో ఆయన ప్రధాని మోడీని కలువకుండానే తదుపరి గమ్యస్థానం నేపాల్కు చేరుకున్నారు. ఇటీవలే అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దలీప్ సింగ్తోనూ మోడీ సమావేశం కాలేదు. కానీ, రష్యా విదేశాంగ మంత్రితో సమావేశం కావడం చర్చనీయాంశంగానే మారింది. భారత్ దౌత్యపరంగా ఏ దేశానికి ప్రాధాన్యత ఇస్తున్నది? ఏ దేశాలతో భారత్ గాఢమైన సంబంధాలను నెరపుతున్నదనే విషయాలను ఈ సమావేశం వెల్లడించింది. ఎందుకంటే.. ఈ 15 రోజుల్లో యూకే, చైనా,
ఆస్ట్రియా, గ్రీస్, మెక్సికోల నుంచీ మంత్రులు భారత్ పర్యటించినా.. మోడీ ఎవరితోనూ భేటీ కాలేదు. భారత్ ప్రభుత్వం ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నది? ఎవరితో సంబంధాలు బలంగా కోరుకుంటున్నది? కొనసాగిస్తున్నదీ? నరేంద్ర మోడీ, సెర్జీ లావరోవ్ల సమావేశం వెల్లడించిందని నిపుణులు చర్చిస్తున్నారు.