భారత్ లో ఆగని కరోనా విలయతాండవం... మరో 6వేలకు పైగా కేసులు

By telugu news teamFirst Published May 23, 2020, 9:57 AM IST
Highlights

కరోనా బాధితులు లక్ష దాటిన దేశాల జాబితాలో భారత్ 11వ స్థానంలో నిలిచింది.మరికొద్దిరోజుల్లో కరోనా కేసుల్లో భారత్ ఇరాన్ ని కూడా దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.

దేశంలో కరోనా విజృంభణ రోజు రోజుకీ పెరిగిపోతోంది. లాక్ డౌన్ 4 లో కొన్ని సడలింపులు చేయడంతో  కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి.

కాగా.. భారత్ లో ఇప్పటి వరకూ 1,25,101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయిి. యాక్టివ్ కేసులు 69,597 ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 3,720 మంది కరోనా కారణంగా మృతి చెందారు. 51,784 మంది కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు. మహారాష్ట్ర, గుజారాత్, ఢిల్లీ, తమిళనాడుల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కొత్తగా 6,654 కేసులు నమోదయ్యాయి. మూడు రోజుల్లోనే భారత్ లో 16 వేల కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది.

గురువారం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 118,226 గా ఉండగా.. గడిచిన 24 గంటల్లో 6,654 కేసులు పెరిగాయి. కాగా.. మొన్నటి వరకు కాస్త తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన కేసులు ఇప్పడు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ 6వేలకు పైగా కేసులు పెరుగుతుండటం ప్రజలను కలవర పరుస్తోంది.

మరో వారం రోజుల్లో నాలుగో విడుత లాక్ డౌన్ కూడా ముగియనుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనాతో కలిసి జీవించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీనే ప్రకటించడం గమనార్హం. దీంతో.. ఈ మహమ్మారి విరుగుడే లేదా అనే భయం ప్రజల్లో పట్టుకుంది. 


 కరోనా బాధితులు లక్ష దాటిన దేశాల జాబితాలో భారత్ 11వ స్థానంలో నిలిచింది. మరికొద్దిరోజుల్లో కరోనా కేసుల్లో భారత్ ఇరాన్ ని కూడా దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, మహారాష్ట్రలో మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 44% ఆ ఒక్క రాష్ట్రంలో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 41,000 మార్క్ దాటగా.. ఒక్క ముంబయి మహానగరంలోనే 25,500 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. 

గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో 80 శాతం.. మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌లలోనే ఉన్నాయి. దేశంలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య ప్రస్తుతం 17కు చేరింది. నిన్న మొన్నటి వరకూ తక్కువ కేసులు నమోదయిన ఒడిశా, కర్ణాటక, హర్యానాలోనూ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోడం అందరినీ కలవర పెడుతోంది. 

click me!