అఫ్గాన్ పౌరుల కోసం భారత్ ఈ-ఎమర్జెన్సీ వీసాలు....

By AN TeluguFirst Published Aug 17, 2021, 2:43 PM IST
Highlights

భారత్ కు వచ్చేందుకు ఆఫ్గాన్లు చేసుకున్న వీసా దరఖాస్తుల ఫాస్ట్ ట్రాక్ పరిశీలన కోసం e-Emergency X-Misc Visa పేరుతో ప్రత్యేక కేటగరీ ఎలక్ట్రానిక్ వీసాలను ప్రవేశపెట్టింది’ అని హోంశాఖ అధికార ప్రతినిధి ట్విటర్ వేదికగా వెల్లడించారు. 

తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్ లో కల్లోలం నెలకొన్న నేపథ్యంలో ఆ దేశ పౌరుల కోసం భారత్ కొత్త వీసా కేటగిరీని ఏర్పాటు చేసింది. ఆఫ్గన్ల దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఈ-ఎమర్జెన్సీ వీసాలను ప్రకటించింది. ‘ఆప్గాన్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీసీ నిబంధనలమీద కేంద్ర హోం శాఖ సమీక్ష చేపట్టి వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. 

భారత్ కు వచ్చేందుకు ఆఫ్గాన్లు చేసుకున్న వీసా దరఖాస్తుల ఫాస్ట్ ట్రాక్ పరిశీలన కోసం e-Emergency X-Misc Visa పేరుతో ప్రత్యేక కేటగరీ ఎలక్ట్రానిక్ వీసాలను ప్రవేశపెట్టింది’ అని హోంశాఖ అధికార ప్రతినిధి ట్విటర్ వేదికగా వెల్లడించారు. 

ఆఫ్గాన్ లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కాబూల్ లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఎమర్జెన్సీ ఎలక్ట్రానిక్ వీసాలను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఈ కొత్త కేటగిరీతో ఎలాంటి మతపరమైన ప్రాధాన్యత లేకుండా ఆఫ్గాన్ లోని ప్రతి ఒక్కరు వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు సమాచారం.

మొదట ఆరు నెలల కాల పరిమితితో ఈ వీసాలు మంజూరు చేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా దరఖాస్తు దారుల వ్యక్తిగత వివరాలను నిశితంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు కావాల్సిన పత్రాలను త్వరలోనే అప్ లోడ్ చేయనున్నట్లు సమాచారం. 

ఎంబసీ మూసివేడంతో కాబుల్ లో ఉన్న భారత రాయబార కార్యాలయ అధికారులు, సిబ్బందిని స్వదేశానికి తరలిస్తున్నారు. ఇక ఆ దేశంలో చిక్కుకుపోయిన భారత పౌరులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారిని కూడా వెనక్కి రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

కాగా,  తాలిబన్ల అధీనంలోకి వచ్చిన ఆప్ఘనిస్థాన్లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారడంతో ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. ఈ మేరకు భారత్ మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే భారత రాయబారి  సహా ఎంబసీ సిబ్బందిని స్వదేశానికి తరలించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాబూల్లోని భారత రాయబార సిబ్బంది, భద్రత విభాగాల అధికారులను తక్షణమే తరలించాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో వీరిని తీసుకొస్తున్నారు. 120 మందికి పైగా అధికారులు, సిబ్బందితో  వాయుసేన సి-17  విమానం కాబూల్ నుంచి బయలుదేరింది. ఎంబసీ కి చెందిన కీలక పత్రాలను కూడా భద్రంగా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.  ఆదివారం రాత్రి భారత వాయుసేనకు చెందిన భారీ విమానం ఒకటి ఇరాన్ గగనతలం నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్లి  మన దేశానికి చెందిన కొందరిని తీసుకు వచ్చినట్లు సమాచారం.  

అయితే,  దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. మరోవైపు  ఆఫ్గాన్ లో చిక్కుకున్న భారత పౌరులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  వీరందరినీ సురక్షితమైన ప్రాంతాల్లో భద్రత దళాల రక్షణ నడుమ ఉంచినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో వీరందరినీ భారత్కు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

click me!