కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఫ్లైట్ నుంచి బలవంతంగా దింపేయండి: ఢిల్లీ హైకోర్టు

Published : Jun 03, 2022, 01:08 PM IST
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఫ్లైట్ నుంచి బలవంతంగా దింపేయండి: ఢిల్లీ హైకోర్టు

సారాంశం

విమాన ప్రయాణాల్లో చాలా మంది మాస్కులు ధరించడం లేదని, విమానాశ్రయాలు, ఫ్లైట్స్‌లలోనూ కొవిడ్ నిబంధనలను కచ్చితత్వంతో అమలు చేయాలని ఓ పిటిషనర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ విచారిస్తూ.. మాస్క్ ధరించడం, పరిశుభ్రతగా ఉండటం వంటి నిబంధనలను తప్పకుండా అమలు చేయాలని, ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అవసరం అయితే.. విమానం నుంచి బలవంతంగా దింపేయాలనీ హైకోర్టు ఆదేశించింది.

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదు. స్వల్ప మొత్తంలో అయినా కేసులు నమోదు అవుతున్నాయి. ఏ క్షణంలోనైనా పరిస్థితులు గంభీరంగా మారే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎయిర్‌పోర్టుల్లో, విమానాల్లో తప్పకుండా మాస్క్ ధరించే నిబంధనను కచ్చితత్వంతో అమలు చేయాలని ఆదేశించింది. ఈ నిబంధన ఉల్లంఘించిన వారిపై పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని తెలిపింది. కానీ, నిబంధనలు మాత్రం అమలు చేయాలని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ (ఏసీజే) విపిన్ సింగ్ సారథ్యంలోని బెంచ్ చెప్పింది. ఈ నిబంధనలు ఉల్లంఘించినవారిని అవసరమైతే.. బలవంతంగానైనా విమానం నుంచి దింపేయాలని ఆదేశించింది.

ఎయిర్‌పోర్టు, విమానాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి అనే నిబంధన అమల్లోనే ఉన్నదని డీజీసీఏ కౌన్సెల్ కోర్టులో వివరించింది. అయితే, భోజనం చేసేటప్పుడు మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉన్నదని తెలిపింది.

విమానాలు, విమానాశ్రయాల్లో మాస్క్ నిబంధనలు తప్పకుండా అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం డీజీసీఏ వేర్వేరుగా నిబంధనలు రూపొందించాలని తెలిపింది. ప్రయాణికులు, ఇతరులు మాస్క్ ధరించడం, ఇతర పరిశుభ్రత నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకునేలా గైడ్‌లైన్స్ రిలీజ్ చేయాలని వివరించింది. అలాంటి ప్రయాణికులపై కేసు నమోదు చేయాలని, జరిమానా విధించాలని, నో ఫ్లై లిస్ట్‌లోనూ చేర్చాలని పేర్కొంది.

ఫ్లైట్స్, ఎయిర్‌పోర్టుల్లో కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. 

మాస్క్ తప్పనిసరి నిబంధన కేవలం కరోనా ముప్పును తగ్గించడానికేనని ఏసీజే వివరించారు. భోజనం చేసేటప్పుడు లేదా పానియాలు తాగేటప్పుడు మాస్క్ తీసుకోవచ్చని తెలిపారు. ఫ్లైట్స్‌లో తప్పకుండా మాస్క్ ధరించాలనే నిబంధన ఇప్పటికే అమల్లో ఉన్నదని పేర్కొన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తున్న తరుణంలో నిపుణులతో నిబంధనల అమలు విధానాలపై చర్చించి పటిష్టమైన విధానాలను రూపొందించాలని పిటిషనర్‌ కోర్టును కోరారు. తాను విమాన ప్రయాణం చేసేటప్పుడు చాలా మంది మాస్కులు ధరించకుండా వెళ్తుండటాన్ని పరిశీలించానని వివరించారు.

PREV
click me!

Recommended Stories

తమిళనాడు అసంబ్లీలో గందరగోళం | Udhayanidhi Stalin vs Aadhav Arjuna | CM Vijay | Asianet News Telugu
మాటలకందని విషాదం.. కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్ర‌మాదం 14 మంది మృతి, బిల్డింగ్ నుంచి దూకిన విద్యార్థులు