
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీంపై ఆందోళనలు జరుగుతుండగా.. వీటితోపాటు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు. ఇలాంటి ఓ నిరసన కార్యక్రమలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలను ఉద్దేశిస్తూ ఓ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ అగ్నిపథ్ స్కీంపై విమర్శలు సంధిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ఒక వేళ హిట్లర్ దారిలో వెళ్తే.. హిట్లర్ చావే చస్తాడు అంటూ వ్యాఖ్యానించారు. మోడీ పూర్తిగా నియంతగా మారిపోయినట్టు నాకు అనిపిస్తున్నదని అన్నారు. హిట్లర్ చరిత్రను మోడీ మళ్లీ పునరావృతం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నదని పేర్కొన్నారు. హిట్లర్ కూడా ఒక సంస్థ ఏర్పాటు చేశాడని, దాని పేరు ఖాకీ అని ఉండేదని చెప్పారు. ఈ సంస్థను సైన్యం మధ్యలోనే తయారు చేశాడని అన్నారు.
ఒక వేళ మోడీ కూడా హిట్లర్ ఆలోచనల్లోనే నడిస్తే.. ఆయన కూడా హిట్లర్ చావే చస్తాడని కొత్త వివాదానికి తెరతీశాడు.
ఈ వ్యాఖ్యలపై వివరణ అడగ్గా సుభోద్ కాంత్ సహాయ్ ఇలా స్పందించాడు. ఇది ఒక స్టేట్మెంట్ కాదని, ఇదొక నినాాదం అని పేర్కొన్నారు. తన విద్యార్థి దశ నుంచి ఈ నినాదం ఉన్నదని వివరించారు. ఎవరైతే హిట్లర్ దారిలో నడుస్తారో.. వారు హిట్లర్ చావే చస్తారు అనేది ఒక స్లోగన్ అని తెలిపారు. ప్రధాని మోడీ కూడా ఈ స్లోగన్ అనాలని చెప్పారు. ఇంతకు ప్రధాని మోడీ ఏ దారిలో వెళ్తున్నారో ఆయనను స్వయంగా కలిసి అడగాలని విలేకరులకు సూచించారు.
కాగా, కాంగ్రెస్ నేత సుభోద్ కాంత్ సహాయ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా ఎన్సీపీ నేత మజీద్ మెమన్ వీటిపై స్పందించబోనని పేర్కొన్నట్టు టైమ్స్ నౌ సంస్థ కథనాన్ని ప్రచురించింది. ప్రతి ఒక్క రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించాలని అనుకోవడం లేదని, అవి వారి వారి అభిప్రాయాలను అన్నాడు.
కాగా, బీజేపీ ప్రతినిధి షెహెజాద పూనావాలా ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. ఒక్కో నేత ఒక్కోలా పేలుతుంటే.. కాంగ్రెస్ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అసలు వీరికి కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే సూచనలు చేసి ఉంటారని ఆరోపణలు చేశారు.