
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ రిక్రూట్మెంట్ కింద వయోపరిమితి పెంచిన కేంద్రప్రభుత్వం ఇక వెనక్కి తిరిగి చూడాలనుకోవట్లేదని తెలుస్తున్నది. అగ్నిపథ్ స్కీంపై వెనక్కి తగ్గేదే లేదని పరోక్షంగా సంకేతం ఇస్తూ.. ఉద్యోగ భర్తీ ప్రకటన చేసింది. ఈ స్కీం కింద తొలిగా ఎయిర్ఫోర్స్ రిక్రూట్మెంట్ చేయనుంది. జూన్ 24 నుంచి ఎయిర్ఫోర్స్ కోసం అగ్నివీర్లను ఎంపిక చేస్తామని ఎయిర్ఫోర్స్ ప్రకటించింది.
ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి మాట్లాడుతూ, రిక్రూట్మెంట్ కోసం గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లకు పెంచామని ప్రకటించడానికి సంతోషిస్తున్నానని చెప్పారు. ఈ నిర్ణయం యువతకు లబ్ది చేకూరుస్తుందని తెలిపారు. భారత వైమానిక దళంలో అగ్నిపథ్ స్కీం కింద రిక్రూట్మెంట్ ఈ నెల 24 నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించారు.
బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఆందోళనలు జరుగుతున్న తరుణంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఈ ప్రకటన చేసింది.
ఇదిలా ఉండగా, అగ్నిపథ్ పథకం గురించి నిరసనకారుల నుంచి వినిపిస్తున్న ప్రధానమైన అసంతృప్త వ్యాఖ్యలు రెండు. ఒకటి ఉద్యోగ భద్రత. రెండోది పెన్షన్లు. అగ్నిపథ్ స్కీంకు ముందు రిక్రూట్మెంట్ చేసుకున్న వారికి 17 ఏళ్ల సర్వీసు ఉండేది. అందులోనూ కొందరు తమ సర్వీసు వ్యవధిని మరికొంత పెంచుకోవడానికి వెసులుబాటు ఉండేది. వీరికి జీవితాంతం పెన్షన్ లభించేది.
కానీ, కొత్త స్కీం ప్రకారం, అగ్నివీర్లు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉద్యోగాలు చేస్తారు. ఆ తర్వాత చాలా మంది అగ్నివీర్లు రిటైర్ కావాల్సిందే. వారికి పెన్షన్లు ఉండవు. గతంలో తాము ఆర్మీ ఉద్యోగాల కోసం నాలుగు ఐదు సంవత్సరాలు కష్టపడేవారిమి అని నిరసనకారులు చెబుతున్నారు. తద్వారా ఉద్యోగం పొంది రిటైర్ అయ్యాక జీవితాంతం పెన్షన్లు కూడా వచ్చేవని అంటున్నారు. తమ ప్రిపేరేషన్కు కేటాయించిన సమయం కూడా తమ ఉద్యోగానికి ఉండకుంటే ఎలా అని నిలదీస్తున్నారు. అది కూడా నాలుగేళ్ల తర్వాత మళ్లీ నిరుద్యోగిగా బయటకు రావాల్సి ఉంటుందని అంటున్నారు.