
పోలీసు సిబ్బంది సమక్షంలోనే శివసేన తనపై హత్యాయత్నానికి పాల్పడిందని బీజేపీ నేత కిరీట్ సోమయ్య శనివారం ఆరోపించారు. ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్ వెలుపల అధికార పార్టీకి చెందిన 100 మంది గూండాలు తన కారుపై రాళ్లు రువ్వారని, దీంతో తాను గాయపడ్డానని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని అన్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఆయన ఓ వీడియో షేర్ చేశారు. అందులో సోమయ్య ముఖంపై రక్తం కనిపిస్తోంది. అలాగే ఆయన కారు కిటికీ అద్దంలో ఒకటి పగిలిపోయి కనిపిస్తోంది. అతడిపై దాడి జరిగిన తరువాత సోమయ్య బాంద్రా పోలీస్ స్టేషన్కు తన కారులో కూర్చుని ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ముంబై పోలీసులు తన ఎఫ్ఐఆర్ను నమోదు చేయడానికి నిరాకరించారని, బదులుగా ఒకే రాయి విసిరారని పేర్కొంటూ బోగస్ కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. అయితే బీజేపీ నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) మంజునాథ్ షింగే తెలిపారు.
అమరావతి ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణా అరెస్టు తర్వాత సోమయ్య ఖార్ పోలీస్ స్టేషన్ను సందర్శించినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎం ఉద్ధవ్ థాకరే వ్యక్తిగత నివాసం ‘మాతోశ్రీ’ వెలుపల హనుమాన్ చాలీసా పఠించే ప్రణాళికను రద్దు చేసిన కొన్ని గంటల తర్వాత నవనీత్ రాణా, ఆమె భర్తను అంతకుముందు రోజు పోలీసులు అరెస్టు చేశారు.
అయితే ఈ విషయంలో సోమయ్య పోలీసు స్టేషన్ను సందర్శించడాన్ని వ్యతిరేకిస్తూ శివసేన కార్యకర్తలు ధర్నా చేశారు. ఆయన స్టేషన్ నుంచి వెళ్లిపోతుండగా దాడి జరిగింది. ఆయన కారుపై రాళ్లు రువ్వడంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ‘‘ నేను షాక్ అయ్యాను. 50 మంది పోలీసుల సమక్షంలో ఖార్ పోలీస్ స్టేషన్ కాంపౌండ్ లో శివసేన కు చెందిన 100 మంది గుండాలు నాపై రాళ్లతో దాడి చేశారు. నన్ను చంపాలనుకున్నారు. పోలీస్ కమిషనర్ ఏమి చేస్తున్నాడు ? ఎంత మంది మాఫియా సేన గుండాలు పోలీసు స్టేషన్ లో గుమికూడేందుకు అనుమతించారు? " అని సోమయ్య ట్వీట్లో పేర్కొన్నారు.
ఈ ఘటనపై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించారు. దీనిని చూస్తుంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి పూర్తిగా పతనం అయినట్టు తెలుస్తోంది. ‘‘ ముంబై , మహారాష్ట్రలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా కుప్పకూలింది. ఖార్ పోలీస్ స్టేషన్ ముందు ఎదుట, పోలీసు సిబ్బంది సమక్షంలో మహారాష్ట్ర బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్యపై గూండాలు దాడి చేశారు. ఇది ఆమోదయోగ్యం కాదు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం ’’ అంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు.
అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. సోమయ్యపై దాడి జరిగే అవకాశం ఉందని సోమయ్య ఖార్ పోలీసులకు తెలియజేశారని, Z+ భద్రతను కోరారని దేవేంద్ర పడ్నవీస్ అన్నారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు. కాగా ఈ విషయంలో తమ పార్టీ మౌనంగా ఉండదని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ తీవ్రంగా హెచ్చరించారు.