
ఢిల్లీ: వ్యాపార వేత్త విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్కు వెళ్లేముందు తాను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిసినట్లు మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం వదిలి వెళ్లిపోయే ముందు అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ఆయన్ను చాలా సార్లు కలిసినట్లు స్పష్టం చేశారు. కేసు విచారణ నేపథ్యంలో లండన్లోని వెస్ట్మినిస్టర్ కోర్టుకు హాజరైన మాల్యా బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్నట్లు అంగీకరించారు.
అయితే రుణాలను తిరిగి బ్యాంకులకు చెల్లించేందుకు అరుణ్ జైట్లీకి తాను చాలా మార్గాలు సూచించానని ఇది నిజమన్నారు. విజయ్మాల్యా కేంద్రఆర్థిక మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్ష పార్టీలన్నీ విమర్శల దాడికి దిగుతున్నాయి. ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి వెళ్లిపోయేందుకు బీజేపీనే అవకాశం కల్పిస్తుందని అందుకు నిదర్శనమే విజయ్ మాల్యా చేసిన వ్యాఖ్యలని విమర్శిస్తున్నారు.
మాల్యా దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రభుత్వం ఎందుకు అవకాశం కల్పించిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాల్యా వ్యాఖ్యలపై స్పందించారు. మాల్యా వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోదీ తప్పకుండా స్పందించాలి. ఈ విషయం గురించి ఆయనకు తెలియకుండా ఉండే అవకాశం లేదు అని ట్వీట్ చేశారు. అరుణ్ జైట్లీ ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు దాచి ఉంచారని మరో ట్వీట్లో ప్రశ్నించారు కేజ్రీవాల్.
నరేంద్ర మోదీ ప్రభుత్వం విజయ్మాల్యా వంటి కొందరు బడా వ్యాపారవేత్తలకు మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తోందని ఇటీవలే లండన్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మాల్యా దేశం విడిచి వెళ్లాక చాలా మంది బీజేపీ సీనియర్ నాయకులను కలిశారని, తన వద్ద ఆధారాలు ఉన్నాయని రాహుల్ లండన్లో స్పష్టం చేశారు.
విజయ్ మాల్యా వ్యాఖ్యలు, ప్రతిపక్ష పార్టీల విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫేస్ బుక్ వేదికగా స్పందించారు. విజయ్మాల్యా చేసిన ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయని అందులో వాస్తవం లేదని పేర్కొన్నారు. 2014 నుంచి అసలు మాల్యాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.