
ఒడిశా : అర్ధరాత్రి దాటి ఊళ్లన్నీ నిశ్శబ్దంగా నిద్రపోతున్న సమయంలో ఓ వ్యక్తి డయల్ 100 కు ఫోన్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన పోలీసులతో ’నా భార్యను చంపేశాను.. నన్ను అరెస్టు చేసి తీసుకు వెళ్ళండి‘ అంటూ చెప్పాడు. విన్న పోలీసులకు ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు. ఆకతాయిలు ఎవరైనా ఫోన్ చేసారా? నిజంగానే హత్య జరిగిందా? అని ఆలోచించారు. ఏమై ఉంటుందో అని అవతల వ్యక్తి చెప్పిన అడ్రస్ కు వెళ్లి చూసి నిశ్చేష్టులయ్యారు. నిద్రపోతున్న భార్యను గొంతు నులిమి చంపేసిన ఓ ప్రబుద్ధుడు తాపీగా పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయాడు.
ఎచ్చెర్ల మండలం పూడివలసలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎచ్చెర్ల మండలం పూడివలస గ్రామానికి చెందిన జరుగుళ్ల రామారావు ( ఆనంద్ పాల్) భార్య నాగరత్న (45)ను మంగళవారం రాత్రి హత్య చేశాడు. రామారావు పాస్టర్ గా పని చేస్తున్నాడు. నాగరత్నం ఫరీదుపేట సచివాలయం ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. పూడివలస నివాసముంటూ ఫరీదుపేట రాకపోకలు సాగిస్తుంటారు.
భార్యను బైక్పై సచివాలయం వద్ద దించి సాయంత్రం పూట మళ్ళీ ఇంటికి తీసుకు వెడుతుంటాడు. అయితే కొన్ని రోజులుగా రామారావు ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఆయనకు సాయంత్రం అయితే కళ్ళు సరిగా కనిపించడం లేదు. తొమ్మిదేళ్ల కిందట పెళ్లి చేసుకున్న వీరికి ఆరేళ్ల రాజ్ కుమార్ పాల్ అనే కుమారుడు ఉన్నాడు. కొన్ని నెలలుగా ఈ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. చీటికి మాటికి గొడవలు పడటం ప్రారంభించారు. నాగరత్నంను కన్నవారింటికి వెళ్లవద్దని రామారావు చెబుతుండేవాడు. అయినా ఆమె టెక్కలి సమీపంలోని నందిగాంలోని పుట్టింటికి వెళ్ళింది. దీనిమీద అప్పట్లో ఒకసారి చేయి చేసుకున్నాడు కూడా. తన మాట వినడం లేదని తరచూ ఆమె పై ఆంక్షలు విధించేవాడు.
దీంతో కుటుంబ కలహాలు పెరిగిపోయాయి. మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గంటల కొద్దీ వాదించుకున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత నిద్రపోతున్న భార్యను రామారావు గొంతు నులిమి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక క్రైమ్ స్టాపర్ 100కు ఫోన్ చేసి తన భార్యను చంపేశాను అని, తనను తీసుకుపోవాలని తానే సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంశయిస్తూనే సంఘటన స్థలానికి వచ్చారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే నాగరత్న మృతదేహం మంచంపై పడి ఉంది. దీంతో హంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు,
అనాథగా మారిన కొడుకు..
రాత్రి పడుకున్నప్పుడు పక్కనే ఉన్న అమ్మ.. ఉదయానికి మృతదేహం గా మారడంతో చిన్నారి రాజ్కుమార్ కన్నీరుమున్నీరయ్యాడు. అమ్మ కావాలంటూ గుక్కపట్టి ఏడ్చాడు. ఒక్కడే కుమారుడు కావడంతో తల్లి గారాబంగా పెంచింది. అమ్మ హత్యకు గురికావడం.. తండ్రి జైలుకు వెళ్లడంతో కుమారుడి పరిస్థితి ఒక్కసారిగా తలకిందులు అయిపోయింది. ప్రస్తుతం అతడిని అమ్మమ్మ, తాతయ్యలు తీసుకువెళ్లారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని తీసుకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.