జ‌మ్మూకాశ్మీర్ ను ముంచెత్తిన భారీ వ‌ర్షాలు.. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 8 మంది మృతి

Published : Jul 19, 2023, 07:51 PM IST
జ‌మ్మూకాశ్మీర్ ను ముంచెత్తిన భారీ వ‌ర్షాలు.. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 8 మంది మృతి

సారాంశం

Srinagar: జమ్మూ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో దోడా, కిష్త్వార్ జిల్లాల్లోని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా కథువా, సాంబా జిల్లాల్లోని నదులు, వాగులు వరద హెచ్చరిక స్థాయికి దగ్గరకు చేరాయి. ఈ ప్రాంతంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షానికి రాంబన్ జిల్లాలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. భారీ వర్షం కారణంగా ఇల్లు కూలిపోయి, కొండచరియలు విరిగిపడి 8 మంది మ‌ర‌ణించారు.  

Heavy Rain In Jammu Kashmir: జ‌మ్మూకాశ్మీర్ భారీ వర్షం కారణంగా ఇల్లు కూలిపోయి, కొండచరియలు విరిగిపడి 8 మంది మ‌ర‌ణించారు. కథువా జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. భారీ వర్షాలకు బానీ ప్రాంతంలో అబ్దుల్ ఖయూమ్, ముస్తాక్ అహ్మద్ కు చెందిన రెండు ఇళ్లు కూలిపోయాయని అధికారులు తెలిపారు. పిల్లలు, మహిళలు సహా ఖయ్యూమ్ కుటుంబానికి చెందిన ఐదుగురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామనీ, మూడు మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. మరో ఇద్దరు కూడా మృతి చెందినట్లు అనుమానిస్తున్నామని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇదే ప్రాంతంలోని మ‌రో ఘ‌ట‌న‌లో కొండచరియలు విరిగిపడటంతో బాలుడితో సహా ముగ్గురు మృతి చెందారు.

జ‌మ్మూకాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పాటు శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిని మూసివేశారు. వరదల కారణంగా పలు వంతెనలు, కల్వర్టులు, రోడ్లు దెబ్బతిన్నాయి. వైష్ణోదేవి యాత్రకు బేస్ క్యాంప్ అయిన జమ్మూ సమీపంలోని కత్రాలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 315 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జమ్మూలోని తావి నది ప్రమాదస్థాయిని తాకడంతో తావి నదీతీరంలో జరుగుతున్న పనులకు వరద నీరు అంతరాయం కలిగించింది.  పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిని మూసివేశారు. కథువా జిల్లాలోని చద్వాల్ వంతెన దెబ్బతినడంతో జమ్మూ-పఠాన్ కోట్ హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

జమ్మూ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో దోడా, కిష్త్వార్ జిల్లాల్లోని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా కథువా, సాంబా జిల్లాల్లోని నదులు, వాగులు వరద హెచ్చరిక స్థాయికి దగ్గరకు చేరాయి. ఈ ప్రాంతంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షానికి రాంబన్ జిల్లాలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. జమ్మూ-పఠాన్ కోట్ హైవేపై రాకపోకలను కథువా జిల్లాలో దారి మళ్లించారనీ, తార్నా నాలాలో ఆకస్మిక వరదల కారణంగా వంతెన రెండు స్తంభాలు దెబ్బతిన్నాయని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా దోడా, కిష్త్వార్ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చీనాబ్ నది, దాని ఉపనదుల్లో నీటిమట్టం పెరుగుతున్నందున విద్యార్థుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Udhayanidhi Stalin Speech: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ సూపర్ స్పీచ్| Asianet Telugu
Nitish Kumar Takes Oath in Rajya Sabha: రాజ్యసభలో నితీశ్ కుమార్ ప్రమాణం | Asianet News Telugu