లాక్ డౌన్ పట్టించుకోకుండా గుంపుగా పెళ్లి.. వధూవరులు అరెస్ట్

By telugu news teamFirst Published Apr 18, 2020, 11:10 AM IST
Highlights

లాక్ డౌన్ పాటించని వధూవరులను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షన్నరకుపైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. పలుదేశాల్లో లాక్ డౌన్ విధించారు. సామాజిక దూరం పాటించండి అంటూ నెత్తీనోరు మొత్తుకొని చెబుతున్నారు. అయినా కొందరు మాత్రం అవేమీ పట్టకుండా వ్యవహరిస్తున్నారు. ఇలా లాక్ డౌన్ పాటించని వధూవరులను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్‌లోని నవ్సారికి చెందిన వధూవరులు స్థానిక దేవాలయంలో కుటుంబసభ్యులు 14 మందితో కలిసి  శుక్రవారం పెళ్లి  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వధూవరులతోపాటు 14మంది బంధువులను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన గురించి నవ్సారి ఎస్పీ గిరీష్‌ పాండ్యా మాట్లాడుతూ ‘ఇక్కడ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి 14 మంది గుంపుతో పెళ్లి జరిపిస్తున్నారని సమాచారం అందింది. వెంటనే ఇక్కడికి చేరుకొని వారందరిని అరెస్ట్‌ చేశాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’అని తెలిపారు.

ఇక ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 22,40,191 మంది కరోనా బారిన పడగా 1,53,822 మంది మరణించారు. ఇక భారతదేశం విషయానికి వస్తే 13,835 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 1,767 మంది రికవరీ అయ్యారు, 452 మంది మరణించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 766కుపైగా కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 534 కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

click me!