
దేశంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ప్రధాని మోడీ దేశప్రజానీకాన్ని ఆకర్షించేలా అభివ్రుద్ధి కార్యక్రమాలు, శంఖుస్థాపనలతో బిజీబిజీగా ఉంటే.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా అదే రానున్న సార్వత్రిక ఎన్నికలకు సమయత్నమవుతోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తన పార్టీని బలోపేతం చేయడానికి భారత్ జోడో యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు నేడు విడుదల కానున్నది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ నిర్వహించి.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. పలు నివేదికల ప్రకారం.. గుజరాత్ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించవచ్చు. డిసెంబర్ మొదటి వారంలో ఓటింగ్ జరిగే అవకాశముంది. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీ కి ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదలయితే.. ప్రచారానికి కనీసం నెల రోజుల సమయమైన ఉండే అవకాశముంది. ఇలా పరిశీలిస్తే.. గుజరాత్లో డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయి.
గత నెలలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అప్పుడే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించాల్సి ఉండే.. కానీ పలు కారణాలతో గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. అధికార బీజేపీ కావాలనే ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయకుండా అడ్డుకుందని ఆరోపించాయి. ఏదిఏమైనా .. ఎట్టకేలకు నేడు గుజరాత్ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించబోతోంది.
చివరి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
గతంలో గుజరాత్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. 25 అక్టోబర్ 2017న ఎన్నికల తేదీలు ప్రకటించబడ్డాయి. మొదటి దశ ఎన్నిలకు నవంబర్ 14న, రెండో దశ ఎన్నికలు నవంబర్ 20న జరిగాయి. తొలి దశలో 89, రెండో దశలో 93 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది. గుజరాత్ 14వ శాసనసభ పదవీకాలం ఫిబ్రవరి 18, 2023తో ముగుస్తుంది. దీంతో.. అంతకంటే ముందే ఎన్నికలు నిర్వహించి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
త్రిముఖ పోటీ
గత 24 ఏళ్లుగా గుజరాత్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారంలో ఉంది, అయితే ఈసారి సమీకరణాలు మారుతున్నాయి. ఎందుకంటే ఢిల్లీ,పంజాబ్లలో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్లోనూ అధికారాన్ని కైవసం చేసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే అనధికారిక ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల తేదీకి ముందే ఆమ్ ఆద్మీ పార్టీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇక కాంగ్రెస్ కూడా ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ.. ప్రచారాన్ని సాగిస్తోంది. కాంగ్రెస్ కూడా ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది.