
Lakhimpur violence case: లఖింపూర్ ఖేరి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పై మంగళవారం సాయంత్రం విడుదల అయ్యారు. లఖింపూర్ ఖేరి హింసలో నలుగురు రైతులతో పాటు మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ కేసులో ప్రధాని నిందిగుడిగా ఉన్న ఆశిష్ మిశ్రాకు బెయిల్ లభించడం.. అదికూడా ఐదు రాష్ట్రాల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో బెయిల్ రావడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పటికే దీనిపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకురాలు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. ప్రధాని మోడీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. లఖింపూర్ ఖేరీ ఘటన ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్ ను అత్యున్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం సవాలు చేయాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు. లఖిపూర్ ఖేరీలో ఘటనకు కారణమైన, 8 ప్రాణాలు కోల్పోయిన ఘటనలో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర తేనీ కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కోర్టులో అప్పీలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘‘ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవాలి. ప్రభుత్వం వారు రైతులకు అనుకూలమని చెబుతోంది, అయితే నిందితులకు బెయిల్ రాకుండా వారు కేసును బలంగా ముందుకు తీసుకెళ్లాలి ”అంటూ లఖింపూర్ హింస కేసులో ఆశిష్ మిశ్రా బెయిల్పై ప్రియాంక గాంధీ స్పందించారు.
అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనీ కుమారుడు ఆశిష్ మిశ్రా మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఆశిష్ మిశ్రా తరపు న్యాయవాది అవదేశ్ కుమార్ సింగ్, మిశ్రాను జైలు నుండి విడుదల చేస్తారని, అతను నగరం నుండి బయటకు వెళ్లడంపై ఎటువంటి ఆంక్షలు ఉండవని అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనీ రాజీనామా కోరడం లేదని ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. “ప్రధానమంత్రికి దేశం పట్ల నైతిక బాధ్యత ఉంది మరియు ఈ బాధ్యతను నెరవేర్చడం అతని ధర్మం. ఈ ధర్మం ప్రతి ధర్మం కంటే ఉన్నతమైనది. ఏ రాజకీయ నాయకుడు, ప్రధానమంత్రి లేదా ప్రభుత్వం దీన్ని చేయడంలో విఫలమైనా విస్మరించాలి ”అని రాంపూర్ జిల్లాలోని బిలాస్పూర్ నగరంలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రియాంక అన్నారు.
“ఈ రోజు, ఆ వ్యక్తికి బెయిల్ వచ్చింది మరియు త్వరలో, అతను బహిరంగంగా తిరుగుతాడు, మిమ్మల్ని చంపిన వ్యక్తి. ప్రభుత్వం ఎవరిని కాపాడింది? రైతులను కాపాడిందా? రైతులు చంపబడినప్పుడు పోలీసులు, పరిపాలన యంత్రాంగం ఎక్కడ ఉంది”అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.
గత ఏడాది అక్టోబర్ 3న, లఖింపూర్ ఖేరీలోని టికునియా వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి ఆజయ్ మిశ్రా కాన్వాయ్.. రైతులపై దూసుకెళ్లింది. ఈ సమయంలో కాన్వాయ్ లోని రైతులపైకి పోనిచ్చిన కారును నడుపుతున్నది కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రానే ఆరోపణలు ఉన్నాయి. కావాలనే ఈ కుట్రకు పాల్పడ్డారని సిట్ సైతం తేల్చింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో రైతులతో పాటు ఓ జర్నలిస్టు కూడా ఉన్నారు. ఘటన జరిగిన తర్వాత పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు సిరియస్ అయి.. సుమోటోగా కేసును స్వీకరించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఆజయ్ మిశ్రా అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి కుమారునికి బెయిల్ మంజూరు కావడం గమనార్హం.