
పనాజీ: బీజేపీ అధికారంలోని గోవాలో పార్టీ ఫిరాయింపు వార్తలు గుప్పుమన్నాయి. కాంగ్రెస్ నుంచి సుమారు ఆరుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నట్టు కథనాలు వచ్చాయి. వారు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టూ కొన్ని వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గోవా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గిరీష్ చందోకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బీజేపీ రూ. 40 కోట్లు ఆఫర్ చేస్తున్నదని, డబ్బులతో లోబరుచుకునే విఫల ప్రయత్నాలు చేస్తున్నదని సంచలన ఆరోపణలు చేశారు. ఆ డబ్బులు పుచ్చుకోని బీజేపీలో చేరాలని ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.
గోవా మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగంబర్ కామత్ బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల గురించి కాంగ్రెస్ నేత గిరీష్ చందోకర్ మాట్లాడారు. కాంగ్రెస్ నేతలకు పారిశ్రామిక వేత్తలు, కోల్ మాఫియా నుంచి ఫోన్లు వస్తున్నాయని అన్నారు. కొందరు ఎమ్మెల్యేలను వారు కాంటాక్ట్ చేశారని తెలిపారు. ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఇన్చార్జ్ దినేశ్ గుండు రావుకు కొన్ని విషయాలు వెల్లడించారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఒక్క ఎమ్మెల్యేకు రూ. 40 కోట్లు ఆఫర్ చేస్తున్నట్టు తెలిసిందని వివరించారు.
కాగా, ఈ ఆరోపణలను బీజేపీ కొట్టివేసింది. గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద్ తనవాడే మాట్లాడుతూ, కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తున్నదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను డబ్బులతో ప్రలోబపెడుతున్నట్టు ప్రగల్భాలు పలుకుతున్నదని అన్నారు. ఎప్పటి నుంచే వారు పాటిస్తున్న ఆనవాయితే ఇది.. అందుకే వారికి అలాంటి ఆలోచనలు వస్తున్నాయని వివరించారు. వారి వ్యాఖ్యల్లో నిజం లేదని తోసిపుచ్చారు. కాంగ్రెస్లో నెలకొన్న గందరగోళానికి బీజేపీకి సంబంధం లేదని అన్నారు.
గోవా కాంగ్రెస్లో అంతర్గత పోరు ఏమీ లేదని, అంతా సరిగ్గానే ఉన్నదని పార్టీ స్పష్టం చేసింది. పార్టీ మీటింగ్కు కొందరు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో అంతర్గత పోరు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తమ ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయని, అవన్నీ నిరాధారమైనవని కాంగ్రెస్ ఎమ్మెల్యే మైఖేల్ లొబో అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముంగిట్లో కావాలనే ఈ వదంతులు వ్యాపింపజేస్తున్నారని తెలిపారు. ఒకటి కాకుంటే మరో వదందతిని వారు ప్రచారం చేస్తారని ఆరోపించారు.
ఈ గందరగోళం నేపథ్యంలో గోవా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమిత్ పాట్కర్ మాట్లాడుతూ, 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది కొత్తవారేనని అన్నారు. ఈ రోజు ఫ్లోర్ మీటింగ్ నిర్వహించామని, సీనియర్ ఎమ్మెల్యేలు.. కొత్త ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారని తెలిపారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలు లేవనెత్తడంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చూస్తారని పేర్కొన్నారు.