పెళ్లి వేడుకలో జరిపిన కాల్పుల్లో పదేళ్ల బాలిక మరణించింది. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ఫరీదాపూర్లో ఈ ఘటన చోటు చేసుకొంది.
లక్నో: పెళ్లి వేడుకలో జరిపిన కాల్పుల్లో పదేళ్ల బాలిక మరణించింది. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ఫరీదాపూర్లో ఈ ఘటన చోటు చేసుకొంది. ఫరిదాపూర్లోని న్యూ కాలనీలో శుక్రవారం రాత్రి ఓ పెళ్లి జరిగింది. పెళ్లికి సంబంధించి వధూవరుల్లో ఓ వైపు వారు షాజహాన్పూర్ నుంచి వచ్చారు. ఆ సమయంలో జరిగిన వేడుకల్లో కొందరు వ్యక్తులు తాగిన మైకంలో కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ మాన్సి అనే బాలికకు తగిలింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. బాలిక పెళ్లి కూతురుకు సోదరి అవుతుందని బంధువులు తెలిపారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తున్నట్టుగా ఫరీదాబాద్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సురేంద్ర సింగ్ పచౌరీ చెప్పారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు.
గతంలో కూడ యూపీ రాష్ట్రంలో వివాహా వేడుకల్లో కాల్పులు జరిపిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఈ తరహా ఘటనలపై కేసులు కూడ నమోదయ్యాయి. అయినా కూడ పదే పదే ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షిస్తే పదే పదే ఈ తరహా ఘటనలు పునరావృతం కావని పలువురు అభిప్రాయపడుతున్నారు.