బళ్లారి వెళ్లేందుకు తనకు అనుమతివ్వాలని సుప్రీంకోర్టులో గాలి జనార్ధన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మనమరాలిని చూసేందుకు అనుమతిని కోరారు. అయితే ఈ విషయమై సుప్రీంకోర్టు రేపు విచారణ చేయనుంది.
న్యూఢిల్లీ: బళ్లారికి వెళ్లేందుకు అనుమతివ్వాలని సుప్రీంకోర్టులో గాలి జనార్ధన్ రెడ్డి గురువారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. తనకు మనమరాలు పుట్టిందని ఆపిటిషన్ లో కోరారు. మనమరాలిని చూసేందుకు అనుమతివ్వాలని కోరారు. అంతేకాదు రెండు నెలలు బళ్లారిలోనే ఉండేందుకు అనుమతివ్వాలని ఆ పిటిషన్ లో ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు. గాలి జనార్ధన్ రెడ్డి పిటిషన్ పై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. గాలి జనార్ధన్ రెడ్డి కి మనమరాలు పుట్టిందో లేదో తెలుసుకొని నివేదిక ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు రేపు విచారణ చేయనుంది.
also read:గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి .. సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్
గాలి జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లను ఈ నెల 29వ తేదీ లోపుగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు వారం రోజుల క్రితం ఆదేశించింది. గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణను జాప్యం చేసేందుకు డిశ్చార్జి పిటిషన్లను జాప్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసును విచారిస్తున్న హైద్రాబాద్ సీబీఐ కోర్టును ఈ నెల 29వ తేదీలోపుగా ఈ పిటిషన్లను పరిష్కరించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఓబుళాపురం కేసులో గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ పై ఉన్నారు. బెయిల్ నిబంంధనలను ఉల్లంఘిస్తున్నందున గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ వాదిస్తుంది. సీబీఐ వాదనను గాలి జనార్ధన్ రెడ్డి తరపు న్యాయవాదులు తోసిపుచ్చుతున్నారు.