
దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా ఢిల్లీలో మంకీపాక్స్ కేసు వెలుగుచూసింది. దీంతో దేశంలో మొత్తం మంకీపాక్స్ల కేసుల సంఖ్య 4కు చేరింది. ఢిల్లీలో మొదటి మంకీపాక్స్ కేసు నమోదైనట్టుగా అధికారిక వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ రిపోర్టు చేసింది. మంకీపాక్స్ సోకిన వ్యక్తికి మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నట్టుగా తెలిపింది. ఆ వ్యక్తి వయసు 31 ఏళ్లు కాగా.. అతడికి ఎటువంటి విదేశీ ట్రావెల్ హిస్టరీ లేదు. అతను జ్వరం, చర్మ గాయాలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది.
ఇక, ఆ వ్యక్తి ఇటీవల హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో జరిగిన ఒక స్టాగ్ పార్టీకి హాజరైనట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. మూడు రోజుల క్రితం అతనికి మంకీ పాక్స్ లక్షణాలు కనిపించడంతో మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. అతని నమూనాలను శనివారం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కి పంపగా పాజిటివ్ నిర్దారణ అయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అతని కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ ప్రారంభించబడిందని పేర్కొన్నాయి.
ఇక, భారత్లో ఇంతకుముందు నమోదైన మూడు మంకీపాక్స్ కేసులు కూడా.. కేరళ నుంచి నివేదించబడినవే. వీరిలో ఒకరు యూఏఈ నుంచి రాగా, మరో ఇద్దరు దుబాయ్ నుంచి వచ్చారు. ఇదిలా ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం మంకీపాక్స్ను అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.
అంతర్జాతీయంగా మంకీపాక్స్ ముప్పు మాడరేట్గా ఉన్నప్పటికీ యూరపియన్ రీజియన్లో మాత్రం రిస్క్ తీవ్రంగా ఉన్నదని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ వివరించారు. అంతర్జాతీయంగా ఈ ముప్పు తీవ్రత చిక్కబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఈ వైరస్ అంతర్జాతీయ ప్రయాణాల ద్వారా ఎక్కువగా వ్యాపించే ముప్పు ప్రస్తుతానికి కనిపించడం లేదని చెప్పారు.