జీతాలు అడిగినందుకు.. మహిళా టీచర్లకు నగ్న వీడియోలతో బ్లాక్ ‌మెయిల్

By Siva KodatiFirst Published Sep 22, 2020, 2:31 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో స్కూల్ యాజమాన్యం మహిళా టీచర్ల పట్ల వికృత చర్యలకు పాల్పడింది. జీతాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినందుకు గాను మహిళా ఉపాధ్యాయురాళ్లను వేధించడమే కాకుండా టాయిలెట్స్‌లో రహస్యంగా స్పై కెమెరాలను ఏర్పాటు చేసి వారి అశ్లీల వీడియోలు తీసినట్లు బయటపడింది

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో స్కూల్ యాజమాన్యం మహిళా టీచర్ల పట్ల వికృత చర్యలకు పాల్పడింది. జీతాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినందుకు గాను మహిళా ఉపాధ్యాయురాళ్లను వేధించడమే కాకుండా టాయిలెట్స్‌లో రహస్యంగా స్పై కెమెరాలను ఏర్పాటు చేసి వారి అశ్లీల వీడియోలు తీసినట్లు బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. నగరంలోని సర్దార్ బజార్‌లో ఉన్న రిషబ్ అనే వ్యక్తి అకాడమీ స్కూల్ నడుపుతున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో పాఠశాలను మూసివేశారు.

దీంతో ఆ పాఠశాలలో పనిచేస్తున్న పలువురు మహిళా ఉపాధ్యాయులు తమకు ఇవ్వాల్సిన వేతనాలను చెల్లించాలంటూ స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. పాఠశాల సెక్రటరీగా వున్న రంజీత్ జైన్ అతని కుమారుడు అభినవ్ జైన్‌లు జీతాలు ఇవ్వకుండా వేధించడమే కాకుండా మహిళల బాత్‌రూంలలో రహస్య కెమెరాలు అమర్చారు.

జీతాలు అడగటానికి వచ్చిన మహిళా టీచర్లకు వారి అశ్లీల వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిలింగ్ పాల్పడినట్లు తెలిసింది. యాజమాన్యం తీరును నిరసిస్తూ ఉపాధ్యాయులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు.

అనంతరం మీరట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రంజిత్, అభినవ్‌లపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అక్కడితో ఆగకుండా తండ్రీ, కొడుకులిద్దరూ ఆ వీడియోలను చూపించి మహిళా టీచర్లను తమతో చనువుగా ఉండాలని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని ఓ మహిళా ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకవేళ తాము వారికి లొంగకపోతే చేతబడి చేయించి మమ్మల్ని చంపేందుకు కూడా వెనకాడమని బెదిరించారంటూ మరికొందరు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. 
 

click me!
Last Updated Sep 22, 2020, 2:38 PM IST
click me!