
మార్చి-ఏప్రిల్ నాటికి పాత కరెన్సీ నోట్లైన రూ .100, రూ .10, రూ.5లను శాశ్వతంగా రద్దు కాబోతున్నాయన్న వార్తలపై కేంద్రం స్పందించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాత వంద, పది, ఐదు రూపాయల నోట్లు రద్దు ఊహాగానాలను తప్పుడు నివేదికలు అని కొట్టిపారేసింది.
మార్చి లేదా ఏప్రిల్ నాటికి రూ .100, రూ .10, రూ .5ల పాత సిరీస్ కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యోచిస్తోందని ఇటీవల కొన్ని నివేదికలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.
దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించింది. ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది. ఇది ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పింది. ఇలాంటి తప్పుడు వార్తల్ని దీన్ని నమ్మవద్దని ప్రజల్ని కోరింది.
దీంతోపాటు ఆర్బీఐ అలాంటి ప్రకటన చేయలేదని ట్వీట్ చేశారు. మరోవైపు ఆర్బీఐ ప్రతినిధి కూడా ఈ వార్తలను తోసిపుచ్చారు. ఈ నోట్లను ఉపసంహరించుకునే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు.
కాగా ఒక సమావేశంలో ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎజిఎం) మహేష్ మాట్లాడుతూ ఆర్బీఐ త్వరలోనే పాత కరెన్సీ నోట్లు రూ .100, రూ .10, రూ .5 రద్దు చేయనుందని, ఈ నేపథ్యంలో 2021 మార్చి నుంచి ఈ నోట్లు చలామణిలో ఉండవని ప్రకటించారన్న వార్తలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే.