కుక్క కోసం కొట్లాట.. చివరకు డీఎన్ఏ టెస్ట్ ..

By telugu news teamFirst Published Nov 23, 2020, 2:40 PM IST
Highlights

ఆ కుక్కను ఎవరికి అప్పగించాలి అనేది తలనొప్పిగా మారింది. దీనిపై ఇరు వర్గాలను పిలిపించగా.. ఆ కుక్క తమదంటే.. తమదేఅంటూ వాదించడం ప్రారంభించారు. 

డీఎన్ఏ టెస్ట్.. దీనిని ఎందుకు చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేరం జరిగిన సమయంలో.. నేరస్తులను గుర్తించడానికీ.. లేదా చనిపోయిన వ్యక్తలను గుర్తించడానికి పోలీసులు డీఎన్ఏ టెస్టు నిర్వహిస్తారు. లేదంటే.. ఎవరైనా కొందరు తమ నిజమైన వారసులు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటే కూడా డీఎన్ఏ పరీక్ష చేస్తారు. కొందరు సామాన్యులు.. సెలబ్రెటీలు తమ వారేనని.. కావాలంటే డీఎన్ఏ టెస్టు చేసుకోండి అంటూ సవాలు కూడా విసురుతుంటారు. ఇలాంటి సందర్భాలు, ఘటనలు మనం ఇప్పటి వరకు చాలానే చూశాం. అయితే.. ఓ కుక్క కోసం.. ఆ కుక్క ఎవరిదో తెలుసుకోవడం కోసం డీఎన్ఏ టెస్టు చేయడం ఎక్కడైనా విన్నారా..? ఇలాంటి సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసముంటున్న సాహెబ్‌ ఖాన్‌ అనే వ్యక్తి తమ కుక్క గత కొన్నిరోజులుగా కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కార్తీక్‌ శివ్‌హారే అనే ఏబీవీపీ నేత సైతం ఇదే తరహా ఫిర్యాదు చేశారు. ఇద్దరి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు.. కుక్క కోసం వెతకడం ప్రారంభించగా అచూకీ లభించింది. అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చిపడింది. ఆ కుక్కను ఎవరికి అప్పగించాలి అనేది తలనొప్పిగా మారింది. దీనిపై ఇరు వర్గాలను పిలిపించగా.. ఆ కుక్క తమదంటే.. తమదేఅంటూ వాదించడం ప్రారంభించారు. 

మొదట ఫిర్యాదు చేసిన సాహెబ్‌ ఖాన్‌ ఆ కుక్క వివరాలను వెల్లడిస్తూ.. మూడు నెలల క్రితం ఆ కుక్కను ఫలానా వ్యక్తి దగ్గర కొనుగోలు చేశానని, దాని పేరు కోకోగా పెట్టుకున్నాని వివరించారు. ఆ కుక్క తల్లి వివరాలను కూడా వెల్లడించాడు. మరోవైపు కార్తీక్‌ కూడా ఈ కుక్క తనదేఅని గట్టిగా చెప్పారు. నాలుగు నెలల కిత్రం ఓ వ్యక్తి వద్ద కొన్నానని, దాని పేరు టైగర్‌ అని చెప్పారు. ఆ కుక్క తల్లి వివరాలను కూడా వెల్లడించారు. అయితే ఆ కుక్క మాత్రం కోకా అని పిలిచినా, టైగర్‌ అని పిలిచినా స్పందించడం పోలీసులతో పాటు ఇద్దరు యజమానులను ఆశ్యర్యానికి గురిచేసింది.


ఇక చేసేదేమీ లేక.. చివరికి పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. కుక్కకు డీఎన్‌ఏ టెస్ట్‌ చేసి  దాని తల్లి వివరాలు తెలుసుకుంటే అసలైన యజమాని ఎవరనేది తెలుసుకోవడం సులభమవుతుందని భావించారు. దీనిపై స్థానిక ఎస్పీ మాట్లాడుతూ. కుక్కపై తాము బాధ్యతగా ఉన్నామని, పరీక్ష అనంతరం అసలైన యజమానికి అప్పగిస్తామన్నారు. అయితే ఈ కుక్క చివరికి ఎవరికి దక్కుతుందన్న విషయం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. 
 

click me!