Bhopal: ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను డిప్యూటీ ఎస్పీ, డిప్యూటీ కలెక్టర్ పదవుల్లో నియమించాలని నిర్ణయించామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు.
Olympics & Asian Games Medallists: ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంబంధిత క్రీడల్లో పతకాలు సాధించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. వివరాల్లోకెళ్తే.. ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ క్రీడా అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ చౌహాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది మధ్యప్రదేశ్లో జరగనున్న 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2022' లోగోను శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్ లు కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లల కెరీర్పై ఆందోళన చెందుతున్నారనీ, వారు క్రీడల్లోకి రాకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే, పిల్లలను క్రీడల్లో రాణించేలా ప్రొత్సహించాలని చెప్పారు. టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన భారత జట్టులో ఉన్న హాకీ క్రీడాకారుడు వివేక్ ప్రసాద్ సాగర్ను రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియమించి భోపాల్లో కోటి రూపాయల విలువైన ఇంటిని ఇచ్చిందని ఆయన చెప్పారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను డిప్యూటీ ఎస్పీ, డిప్యూటీ కలెక్టర్ పదవుల్లో నియమించాలని నిర్ణయించామని సీఎం చెప్పారు. "రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి పనితీరు ఆధారంగా 10 మంది ఆటగాళ్లను సబ్-ఇన్స్పెక్టర్లుగా, 50 మందిని కానిస్టేబుళ్లుగా పోలీసు ఫోర్స్లో నియమించాలని నిర్ణయించింది. ఖేలో ఇండియాలో బాగా రాణించి పతకాలు సాధించిన జట్లకు లేదా ఆటగాళ్లకు సంవత్సరానికి రూ. 5లక్షలు ఇవ్వబడుతుందని చెప్పారు.
తమ ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో క్రీడా మౌలిక సదుపాయాలను క్రమంగా అభివృద్ధి చేస్తుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. అలాగే, ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. మధ్య ప్రదేశ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లోని షూటింగ్, ఈక్వెస్ట్రియన్ అకాడమీలను కొనియాడుతూ దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటిగా అభివర్ణించారు. విదేశీ గడ్డపై క్రీడాకారులు పోటీలో గెలిస్తే ఆ దేశ జాతీయ పతాకాన్ని రెపరెపలాడించడంలో క్రీడలకు ఉన్న ప్రాముఖ్యత ఉందన్నారు. 2022లో క్రీడాకారులు సాధించిన వివిధ పతకాలను ఉటంకిస్తూ, ఈ సంవత్సరం క్రీడలకు చాలా ముఖ్యమైనదని ఠాకూర్ అన్నారు. ఖేలో ఇండియా కార్యక్రమం కింద ఐదేళ్లకు రూ.3,195 కోట్ల బడ్జెట్ను కేటాయించినట్లు తెలిపారు. దేశంలో 1,000 ఖేలో ఇండియా కేంద్రాలను ప్రారంభిస్తున్నామనీ, వాటిలో 750 కేంద్రాలను ఇప్పటికే ఆమోదించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి ఈ కేంద్రాల పనులు పూర్తవుతాయని చెప్పారు. అలాగే, ఎంపీ క్రీడా మంత్రి యశోధర రాజే సింధియాను ప్రశంసించారు.
ఈక్వెస్ట్రియన్, షూటింగ్ అకాడమీలతో పాటు, వాటర్ స్పోర్ట్స్ అకాడమీ, తాత్యా తోపే సిటీ స్టేడియం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) సౌకర్యాలను కూడా అంతకుముందు రోజు అనురాగ్ ఠాకూర్ పరిశీలించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్ల ఐదవ ఎడిషన్ వచ్చే ఏడాది జనవరి 30 నుండి ఫిబ్రవరి 11 వరకు నిర్వహించబడుతోందన్నారు. భోపాల్, ఇండోర్, ఉజ్జయిని, గ్వాలియర్, జబల్పూర్, మాండ్లా, బాలాఘాట్, ఖర్గోన్ (మహేశ్వర్)లలో ఈ క్రీడలు జరుగుతాయని ఒక అధికారి తెలిపారు. మొదటిసారిగా, వాటర్ స్పోర్ట్స్, కయాకింగ్, కానోయింగ్, కానో స్లాలమ్, రోయింగ్ ఈ ఎడిషన్ గేమ్లలో భాగంగా ఉంటాయి. గేమ్లలో మొదటిసారి ఫెన్సింగ్ను కూడా చేర్చినట్లు అధికారి తెలిపారు. ఖేలో ఇండియా ఐదవ ఎడిషన్లో భాగంగా, 23 గేమ్ వేదికలలో 27 గేమ్లు ఆడబడతాయి. దాదాపు 6,000 మంది క్రీడాకారులు, 303 మంది అంతర్జాతీయ, 1,089 జాతీయ అధికారులు ఈ ఈవెంట్లో భాగం కానున్నారు. ఖేలో ఇండియా క్రీడల కోసం దాదాపు 2,000 మంది వాలంటీర్లను వివిధ వేదికలపై మోహరిస్తారు.