
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రైవేటు స్కూల్లో కరోనా కలకలం రేపింది. ఓ విద్యార్థికి, ఓ టీచర్కు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో స్కూల్ యజమాన్యం.. కోవిడ్ నిర్దారణ అయిన విద్యార్థి క్లాస్మేట్స్కు సెలవు ఇచ్చి ఇళ్లకు పంపించారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఈ ఘటనపై ఆప్ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్యే Atishi స్పందిస్తూ.. ‘‘ఒక చిన్నారి, ఉపాధ్యాయుడు కోవిడ్కు పాజిటివ్ నిర్దారణ అయినట్టుగా నివేదికలు ఉన్నాయి. తరగతిలోని ఇతర విద్యార్థులను ఇంటికి పంపారు. మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము’’ అని తెలిపారు.
ఇక, ఢిల్లీలో బుధవారం కొత్తగా 299 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కిందటి రోజు కేసులు(202) కంటే 50 శాతం ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. తాజా కేసులతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసు సంఖ్య 18,66,881కి పెరిగింది. గత రెండు నెలలుగా కరోనా కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. అయితే కొద్ది రోజులుగా ఢిల్లీలో కేసుల పెరుగుదల కనిపిస్తుంది.
ఇక, ఢిల్లీ సరిహద్దుల్లోని నోయిడాలో బుధవారం 10 మంది విద్యార్థులకు కోవిడ్ -19 కు పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పిల్లల్లో.. దగ్గు, జలుబు, జ్వరం, విరేచనాలు.. వంటి లక్షణాలు ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని గౌతమ్ బుద్ధ్ నగర్ ఆరోగ్య శాఖ తెలిపింది.