
కోవిడ్ - 19 వ్యాక్సిన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టీకాలు వేసుకోవాలని ఎవరినీ బలవంతం చేయకూడదని స్పష్టం చేసింది. వ్యక్తిగత హక్కులపై కొన్ని పరిమితులను సమాజ ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే విధించవచ్చని కోర్టు పేర్కొంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రస్తుత టీకా విధానం ఏకపక్షం కాదని సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చింది
కానీ ప్రభుత్వం మెరుగైన ప్రజా సంక్షేమం, ఆరోగ్యం కోసం విధానాన్ని రూపొందించవచ్చని, కొన్ని కొన్ని షరతులు విధించవచ్చని తెలిపింది. భౌతిక స్వయంప్రతిపత్తి విషయంలో ప్రభుత్వం నియమాలను రూపొందించవచ్చని పేర్కొంది. అయితే ప్రస్తుత టీకా విధానాన్ని అన్యాయమని పిలవలేమని అభిప్రాయపడింది. ప్రస్తుత వ్యాక్సిన్ విధానం ఏకపక్షంగా ఉందని స్పష్టంగా చెప్పలేమని చెప్పింది. భౌతిక స్వయం ప్రతిపత్తి జీవించే ప్రాథమిక హక్కు కిందకు వస్తుందని తెలిపింది. శాస్త్రీయ ఆధారాలపై నిర్ణయం తీసుకునే నైపుణ్యం కోర్టుకు లేదని చెప్పింది.
వ్యాక్సిన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు కోర్టు మొగ్గు చూపబోదని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. నిపుణుల అభిప్రాయం మేరకు ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాల్లో న్యాయ సమీక్ష పరిధి పరిమితంగా ఉంటుందని తెలిపింది. ప్రజలకు వ్యాక్సిన్ ఆదేశాల ద్వారా విధించిన ఆంక్షలు దామాషా ప్రకారం లేవని కోర్టు పేర్కొంది. కోవిడ్ల సంఖ్య తక్కువగా ఉన్నంత వరకు బహిరంగ ప్రదేశాల్లో టీకాలు వేయని వ్యక్తులను నిషేధించకూడదని తెలిపింది. ఒకవేళ అలాంటి ఉత్తర్వులేమైనా ఉంటే వెనక్కి తీసుకోవాలని చెప్పింది.
టీకాలు వేసిన వ్యక్తితో పోలిస్తే టీకాలు వేయని వ్యక్తి వైరస్ వ్యాప్తి చెందుతుందని నిరూపించడానికి ప్రభుత్వాలు ఎలాంటి డేటాను ఉంచలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రస్తుత వ్యాక్సిన్లకు సంబంధించిన డేటాను ప్రభుత్వం అందుబాటులో ఉంచలేదని పిటిషనర్తో మేము ఏకీభవించడం లేదని చెప్పింది. ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన మొత్తం డేటా పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. పిల్లల కోసం ఆమోదించబడిన వ్యాక్సిన్లకు సంబంధించిన డేటా కూడా పబ్లిక్ డొమైన్లో కూడా అందుబాటులో ఉండాలని చెప్పింది. కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్, ప్రతికూల సంఘటనల డేటాను విడుదల చేయాలని తెలిపింది.
టీకాను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ, క్లినికల్ డేటాను బహిరంగపరచాలని కోరుతూ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) మాజీ సభ్యుడు డాక్టర్ జాకబ్ పులియాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలలో కోవిడ్ వ్యాక్సిన్ను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దరఖాస్తులు దాఖలయ్యాయి. వ్యాక్సినేషన్ స్వచ్ఛందమని కేంద్రం చెబుతోందని అయితే రాష్ట్రాలు కొన్ని ప్రయోజనాల కోసం దీనిని తప్పనిసరి చేశాయని పిటిషన్ దారులు పేర్కొన్నారు. ఆ రాష్ట్రాలు జారీ చేసిన ఆదేశాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని తీర్పు ఇవ్వాలని పిటిషన్లు కోరారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఈ విధంగా తీర్పు వెలువరించింది.