Coronavirus : ఉత్త‌ర కొరియాలో మొద‌టి సారిగా క‌రోనా కేసులు.. లాక్ డౌన్ కు ఆదేశం

By team teluguFirst Published May 12, 2022, 8:42 AM IST
Highlights

ప్రపంచం మొత్తం కరోనాతో అతలాకుతలం అవుతున్న సమయంలో కూడా ఉత్తర కొరియాలో అధికారికంగా ఒక్క కేసు కూడా వెలుగులోకి రాలేదు. కానీ తాజాగా ఆ దేశంలో కరోనా కేసులు నమోదు అయినట్టు ఉత్తర కొరియా మీడియా తెలిపింది. దీనిని నియంత్రించేందుకు లాక్ కూడా విధించనట్టు పేర్కొంది. 

ఉత్తర కొరియా గురువారం అధికారికంగా తన మొదటి కోవిడ్-19 వ్యాప్తిని ధృవీకరించింది. జాతీయ లాక్ డౌన్ ను విధించాల‌ని ఆదేశించింది. ప్యాంగ్యాంగ్ నగరంలో అత్యంత వ్యాప్తి చెందగల ఒమిక్రాన్ వైరస్ స‌బ్ వేరియంట్ ను గుర్తించిన‌ట్టు ప్రభుత్వ మీడియా నివేదించింది. ‘‘దేశంలో అతిపెద్ద అత్యవసర సంఘటన జరిగింది. మా అత్యవసర క్వారంటైన్ ఫ్రంట్ లో హోల్ వచ్చింది. 2020 ఫిబ్రవరి నుంచి ఈ ప్రాంతం సుర‌క్షితంగా ఉంది.’’ అని అధికార కేసీఎన్ఏ వార్తా సంస్థ తెలిపింది. 

ప్యాంగ్యాంగ్లోని ప్రజలు ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డారని, అయితే ఎంత మంది ఈ ఇన్ఫెక్ష‌న్ బారిన ప‌డ్డారనే వివరాలను అందించలేదని నివేదిక తెలిపింది. కరోనా సోకిన వారి నమూనాలను మే 8న సేకరించినట్లు తెలిపింది. కరోనావైరస్ మొదటి వ్యాప్తికి ప్రతిస్పందనలను చర్చించడానికి ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ వర్కర్స్ పార్టీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ నేప‌థ్యంలో ఈ నివేదిక‌ను ప్ర‌చురించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి దేశంలోని అన్ని నగరాలు, ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాలని కిమ్ ఆదేశించారు. అత్యవసర రిజర్వ్ వైద్య సామాగ్రిని సమీకరించనున్నట్లు కేసీఎన్ఏ తెలిపింది. 

కాగా.. గ‌తంలో ఉత్తర కొరియా దేశంలో ఒక్క కరోనావైరస్ సంక్రమణను కూడా ధృవీకరించనప్పటికీ దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్ అధికారులు సందేహాలు వ్యక్తం చేశారు. గ‌తంలో పొరుగునే ఉన్న దక్షిణ కొరియా, చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు విస్తృతంగా వెలుగులోకి వ‌చ్చాయి. కోవాక్స్ గ్లోబల్ కోవిడ్-19 వ్యాక్సిన్ షేరింగ్ ప్రోగ్రామ్, చైనా నుంచి సినోవాక్ బయోటెక్ వ్యాక్సిన్ల ఎగుమతులను ఉత్తర కొరియా తిరస్కరించింది.

కరోనావైరస్ వ్యాప్తిని స్థిరంగా నియంత్రించడం, కోవిడ్ సోకిన వ్యక్తులకు త్వ‌రగా న‌యం అయ్యేలా చూడ‌టం, అతి త‌క్కువ స‌మ‌యంలో క‌రోనా వ్యాప్తి చెందే మూలాలను తొలగించడానికి అవ‌స‌ర‌మైన క్వారంటైన్ వ్య‌వ‌స్థ‌ను తీసుకురావ‌డానికి ఈ తాజా సమావేశాన్ని నిర్వ‌హించామ‌ని వర్కర్స్ పార్టీ సమావేశంలో కిమ్ చెప్పారు.

ప్యోంగ్యాంగ్ లో కార్యకలాపాలను పర్యవేక్షించే దక్షిణ కొరియాకు చెందిన ఒక వెబ్ సైట్.. జాతీయ సమస్య కారణంగా ఇంటికి తిరిగి రావాలని, అంద‌రూ ఇళ్లలోనే ఉండాలని చెప్పినట్లు తెలిపింది. కోవిడ్-19 విష‌యం ప్రస్తావించకుండా చాలా మందికి అనుమానిత ఫ్లూ లక్షణాలు ఉన్నాయ‌ని, కావున మే 11 నుండి ఉత్తర కొరియా తన ప్రజలను ఇంట్లోనే ఉండాలని కోరినట్లు చైనా ప్రభుత్వ టెలివిజన్ గురువారం తెలిపింది.

click me!