
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు సాయంత్రం ఆమె ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టు పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. ఇంటి వద్దే రెస్ట్ తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించినట్టు ట్వీట్ చేశారు.
సోనియా గాంధీ జూన్ 1వ తేదీన కరోనా బారిన పడ్డారు. అనంతరం ఆమె ఐసొలేషన్లోకి వెళ్లారు. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. కరోనా సమస్యలతో ఆమె జూన్ 12న ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్లో చేరారు. ఆమె ఆరోగ్యం సుస్థిరంగా ఉన్నదని ఇటీవలే ఓ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తెలిపారు.
కాగా, నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఆమెను, రాహుల్ గాంధీని ఏజెన్సీ ముందు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 8వ తేదీన సోనియా గాంధీ ఈడీ ముందు హాజరు కావాలని సమన్లు వచ్చాయి. కానీ, ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో విచారణకు హాజరవ్వడానికి మరింత సమయం కావాలని ఆమె ఈడీని కోరారు. ఆమె విజ్ఞప్తి మేరకు ఈడీ ఈ తేదీలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 23వ తేదీ లోపు ఈడీ ముందు సోనియా గాంధీ హాజరు కావచ్చని తెలిపింది.
నేడు ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితుల మేరకు ఇంటి వద్దే రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ నెల 23వ తేదీలోపే ఈడీ ముందు హాజరవుతారా? లేక మరింత సమయాన్ని కోరుతారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉన్నది.