Nagma Fire on Congress: రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో కీలక నేతలను దూరం పెట్టి.. బయటి వారికి అవకాశం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలువురు నేతలు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. సినీ నటి, కాంగ్రెస్ సీనియర్ నేత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా కాంగ్రెస్, కాంగ్రెస్ అధినేత్రిపై కూడా ప్రశ్నల వర్షం కురింపించారు.
జూన్ నెల 10న జరుగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ పది మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆదివారం ప్రకటించింది. ఇందులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా, ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, ఉత్తర్ప్రదేశ్ నేత ప్రమోద్ తివారీ, జైరాం రమేశ్, వివేక్ టంకా లకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించింది. వీరితోపాటు రాజీవ్ శుక్లా (ఛత్తీస్గఢ్), మాజీ ఎంపీ పప్పూ యాదవ్ సతీమణి రంజీత్ రంజన్ (బిహార్), అజయ్ మాకెన్ (హరియాణా), ఇమ్రాన్ ప్రతాప్గర్హి (మహారాష్ట్ర)లకు అవకాశం కల్పించింది. న్నారు. అయితే.. జాబితాపై పలువురు సీనియర్ నేతలను అసంతృప్తికి గురిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తపరిచారు. ‘‘నా తపస్సులో ఏదైనా తగ్గి ఉంటుందేమో..?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ముంబయి యూనిట్ వైస్ ప్రెసిడెంట్, నటి నగ్మా కు ఈ సారి కూడా రాజ్యసభ టికెట్ దక్కకపోవడంతో భంగపాటుకు గురైంది. దీంతో ఆమె కూడా అసంతృప్తికి లోనయ్యారు. దీంతో పవన్ ఖేరా ట్వీట్కు నగ్మా స్పందిస్తూ.. ‘‘ఇమ్రాన్ భాయ్ ముందు నా 18 సంవత్సరాల తపస్సు కూడా తక్కువే’’ అంటూ పార్టీపై విమర్శలు గుప్పించారు. (ఇమ్రాన్ భాయ్.. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ ఎంపిక చేసింది). మరో ట్విట్ లో... ‘‘2003-04లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా జీ.. నన్ను రాజ్యసభకు పంపుతానని మాటిచ్చారు.అప్పుడు మేము అధికారంలో లేము. అప్పటి నుంచి ఈ 18 ఏళ్లలో వారు నాకు ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఇమ్రాన్ను మహారాష్ట్ర నుంచి ఎంపిక చేశారు. ఆ పదవికి నేను అర్హురాలిని కానా?’’ అంటూ నగ్మా కాంగ్రెస్ను ప్రశ్నించారు.
జూన్ 10న దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈఎన్నికలకు ఏడు రాష్ట్రాల నుంచి 10 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్, హర్యానా, కర్ణాటక నుంచి రాజీవ్ శుక్లా, అజయ్ మాకెన్, జైరాం రమేష్లను బరిలోకి దింపింది. రాజ్యసభ ఎంపీ పి చిదంబరంని మరోసారి తమిళనాడు నుంచి పోటీ చేయగా, రంజీత్ రంజన్ ఛత్తీస్గఢ్ నుంచి బరిలోకి దిగారు. మధ్యప్రదేశ్ నుంచి వివేక్ తంఖాను పార్టీ అభ్యర్థిగా నిలిపింది.
ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికలతో రాజ్య సభలో కాంగ్రెస్ అధిక్యం పెరుగనున్నది. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 29గా ఉంది. కొత్తగా జరిగే ఎన్నికల్లో రాజస్థాన్లో 3; ఛత్తీస్గఢ్లో 2; తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్రల్లో ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలను హస్తం పార్టీ గెలుచుకోవడం దాదాపు ఖాయం. అలాగే.. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే.. హరియాన, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లోనూ ఒక్కో స్థానాన్ని కైవసం చేసుకోనున్నది. దీంతో రాజ్య సభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 33కు చేరనున్నది.