Lakhimpur Kheri: కేంద్రమంత్రిని తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్.. ప్రభుత్వంతో మాట్లాడతానని రాష్ట్రపతి హామీ

By telugu teamFirst Published Oct 13, 2021, 1:39 PM IST
Highlights

లఖింపూర్ ఖేరి కేసులో నిందితుడిగా ఉన్న అశిశ్ మిశ్రా తండ్రి అజయ్ మిశ్రాను కేంద్ర హోం శాఖ సహాయమంత్రి పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. బుధవారం ఆయనతో కలిసి రాష్ట్రపతి భవన్ ఎదుట మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హామీనిచ్చినట్టు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వివరించారు.
 

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లఖింపూర్‌ ఖేరీలో చోటుచేసుకున్న ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి Ajay Mishra తనయుడు అశిశ్ మిశ్రా కాన్వాయ్ ఆందోళన చేస్తున్న farmers మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది మరణించగా, నలుగురు రైతులున్నారు. తన కుమారుడు ఆ కాన్వాయ్‌లో లేడని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ కేసులో అశిశ్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బాధితులకు న్యాయం జరగాలని, కేంద్ర మంత్రిని వెంటనే dismiss చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు President Ramnath Kovindను బుధవారం కలిసింది.

Lakhimpur Kheri బాధితుల తరఫున తాము రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యాయని, వెంటనే ఆ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని తాము డిమాండ్ చేశామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇందుకు రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని, కేంద్ర ప్రభుత్వంతో తాను మాట్లాడుతారని హామీనిచ్చారని వివరించింది. ఈ రోజు రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్‌తో Rahul Gandhi, Priyanka Gandhi, మల్లిఖార్జున్ ఖర్గే, ఏకే అంటోనీ, గులాం నబీ ఆజాద్ సహా పలువురు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో రాష్ట్రపతి భవన్ ఎదుట మాట్లాడారు.

Also Read: Lakhimpur Kheri: రాజకీయ నేతలంటే ఫార్చూనర్ కారుతో తొక్కేయడం కాదు: యూపీ బీజేపీ చీఫ్

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రైతులకు వార్నింగ్ ఇచ్చాడని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. రైతులు హద్దులు తెలుసుకుని మెదలాలని, లేదంటే తానే వారికి బుద్ది చెబుతారని హెచ్చరించాడని చెప్పారు. అంతేకాదు, ఆ హెచ్చరికలను ఆచరణలో పెట్టాడని ఆరోపించారు. తన కొడుకు అశిశ్ మిశ్రా కారుతో రైతులను ఢీ కొట్టి పొట్టనబెట్టుకున్నారని ఆగ్రహించారు. తాము ఆ బాధితులతో కలిశామని తెలిపారు. వారు తమను కోరింది రెండే విషయాలనీ చెప్పారు. ఒకటి తమకు న్యాయం జరగాలని, లఖింపూర్ ఖేరి ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. మరొకటి, కేంద్ర మంత్రిగా అజయ్ మిశ్రా కొనసాగినంత కాలం తమకు న్యాయం అందదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే మంత్రిని తొలగించాలని పేర్కొన్నారు. లఖింపూర్ ఖేరి ఘటనపై ఇద్దరు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర మంత్రిగా అజయ్ మిశ్రాను తొలగిస్తేనే బాధిత కుటుంబీకులకు న్యాయం చేకూరుతుందని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఇది తమ డిమాండ్ కాదని, Congress నేతల డిమాండ్ కాదని చెప్పారు. ఇది బాధిత కుటుంబాల డిమాండ్ అని, యూపీ వాసుల డిమాండ్ అని, సరిగ్గా ఆలోచించే ప్రతి భారతీయుడి డిమాండ్ అని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏమన్నారని అడగ్గా, ఆయన సానుకూలంగా స్పందించారని ప్రియాంక గాంధీ వివరించారు. ఈ రోజే కేంద్ర ప్రభుత్వంతో ఆయన మాట్లాడతారని హామీనిచ్చారని  చెప్పారు.

Also Read: Lakhimpur Kheri violence: కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా అరెస్ట్

కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేస్తున్నదని, అయినప్పటికీ కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదని, ఇప్పుడు రాష్ట్రపతి మొత్తం ఈ వ్యవహారాన్ని చక్కబెడతారన్న నమ్మకం మీకు ఉన్నదా అని అడగ్గా ప్రియాంక సమాధానమిచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని, తగిన చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం అందించడం దాని బాధ్యత అని చెప్పారు. కానీ, ఇప్పుడు దళితులు, మహిళలు, కార్మికులు, కర్షకులు, పేదలకు దేశంలో న్యాయం లేదని కేంద్రం సందేశం ఇస్తున్నదని అన్నారు. అదే బీజేపీ నేతలైతే చాలు.. వారు చట్టానికి అతీతులని సందేశమిస్తున్నట్టు ఆరోపించారు.

click me!