అరుణాచల్ ప్రదేశ్ లో తప్పిపోయిన యువకుడిని చైనా పీఎల్ ఏ త్వరలోనే విడుదల చేస్తుందని కేంద్ర మంత్రి కిరెన్ రిజజు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చైనా పీఎల్ ఏ త్వరలోనే తేదీ, సమయం వెళ్లడిస్తుందని చెప్పారు.
అరుణాచల్ ప్రదేశ్ (arunachal pradhesh) నుండి తప్పిపోయిన యువకుడిపై భారత సైన్యం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (Chaina PLA)తో హాట్లైన్ను బుధవారం మార్చుకుంది. 19 ఏళ్ల మిరామ్ టారోన్ (mirom taron) జనవరి 18న బిషింగ్ ఏరియాలోని షియుంగ్ లా నుంచి కనిపించకుండా పోయాడు. అయితే ఆ బాలుడు తప్పిపోయిన ప్రాంతం వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో ఉంది. ఆ బాలుడు చైనా భూభాగంలోకి వెళ్లి పీఎల్ఏ అతడిని అదుపులోకి తీసుకున్నారని అందరూ భావించారు. అందుకే ఆ బాలుడి ఆచూకీ కనుగొనేందుకు భారత సైన్యం వెంటనే చైనా వైపునకు వెళ్లింది. అయితే అతడిని గుర్తించలేకపోయింది.
అయితే అరుణాచల్లో తప్పిపోయిన భారతీయుడిని కనుగొన్నట్లు చైనీస్ PLA మూడు రోజుల కిందట ధృవీకరించింది. ఈ ఘటనలో బాలుడిని విడిపించాలని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అదృశ్యమైన యువకుడి కోసం చైనా ఆర్మీతో హాట్లైన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్టుగా రక్షణ శాఖ (deffence ministry) వర్గాలు రెండు రోజుల కిందట వెళ్లడించింది. ఈ విషయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి ఈరోజు కీలక ప్రకటన చేశారు. ‘‘ పీఎల్ ఏ సానుకూలంగా స్పందించి మా జాతీయుడిని అప్పగిస్తామని చెప్పింది. విడుదల చేసే స్థలాన్ని సూచించింది. వారు త్వరలో తేదీ, సమయాన్ని తెలియజేయడానికి అవకాశం ఉంది. అయితే వారి వైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జాప్యం జరిగింది’’ అని కిరెన్ రిజజు (kiren rijaju) ట్వీట్ చేశారు. ప్రోటోకాల్ల ప్రకారం బాలుడిని శోధన చేసి తిరిగి ఇస్తానని చైనా హామీ ఇచ్చిందని న్యాయ మంత్రి తెలిపారు. శోధన, గుర్తింపు ప్రయత్నాలకు సహాయం చేయడానికి భారత సైన్యం చైనా వైపు యువకుల వ్యక్తిగత వివరాలు, ఫోటోలను కూడా పంచుకుందని చెప్పారు.
మిరామ్ టారోన్ ను తిరిగి రప్పించేందుకు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. యువకుడిని సురక్షితంగా తిరిగి తీసుకొచ్చేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ జోక్యాన్ని కూడా కోరింది. దీంతో రక్షణ శాఖ స్పందించింది. రక్షణ మంత్రిత్వ శాఖ దౌత్య మార్గాల ద్వారా చైనాకు ఈ విషయం చేరవేసిందని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటీవల తెలిపారు.
ఏం జరిగిందంటే..
ఈ నెల 19వ తేదీన సియాంగ్ జిల్లాలోని జిడో ప్రాంతానికి చెందిన మిరామ్ టారోన్ తన స్నేహితులతో కలసి అటవీ ప్రాంతంలో మూలికలు ఏరేందుకు వెళ్లాడు. అందులో నుంచి ఆ యువకుడు తప్పిపోయాడు. ఆ యువకుడిని చైనా ఆర్మీ అపహరించిందని వార్తలు వెల్లువెత్తాయి. ఈ వార్తలకు రాష్ట్రానికి చెందిన ఎంపీ వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చాయి. మిరామ్ ను చైనా ఆర్మీ కిడ్నాప్ చేసిందని ఎంపీ తాపిర్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి యువకుడిని వెంటనే విడుదల చేయించేందుకు ప్రయత్నించాలని కోరారు.