లక్ష లేనిదే లంచం ముట్టడు... ఏసీబీ సోదాల్లో కోట్ల కొద్దీ నగదు, ఆస్తులు..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 16, 2020, 04:42 PM IST
లక్ష లేనిదే లంచం ముట్టడు... ఏసీబీ సోదాల్లో కోట్ల కొద్దీ నగదు, ఆస్తులు..

సారాంశం

పర్యావరణ అనుమతుల కోసం వచ్చే పరిశ్రమల వద్ద లక్షల కొద్ది లంచం పుచ్చుకుంటున్న ఓ అవినీతి తిమింగలం ఏసీబీ అధికారుల వలలో పడింది. ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో బయటపడ్డ నగదు, ఆభరణాలు ఏసీబీ వర్గాల్నే ఆశ్చర్యంలో ముంచేసింది. 

పర్యావరణ అనుమతుల కోసం వచ్చే పరిశ్రమల వద్ద లక్షల కొద్ది లంచం పుచ్చుకుంటున్న ఓ అవినీతి తిమింగలం ఏసీబీ అధికారుల వలలో పడింది. ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో బయటపడ్డ నగదు, ఆభరణాలు ఏసీబీ వర్గాల్నే ఆశ్చర్యంలో ముంచేసింది. 

చెన్నై, సైదాపేట పనగల్‌ మాలిగైలో పర్యావరణ, కాలుష్య నియంత్రణ విభాగం కార్యాలయం ఉంది. ఇక్కడ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న పాండియన్‌ అనుమతుల కోసం వచ్చే సంస్థలు, పరిశ్రమల దగ్గర లంచాలు పడుతున్నారు. లక్షల్లో లంచాలు చేతిలో పడనిదే ఫైలు ముందుకు కదలదు. ఈ అధికారి గుట్టును రట్టు చేస్తూ ఓ సంస్థ ఏసీబీకి రహస్యంగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 

దీంతో ఏసీబీ ఏడీఎస్పీ లావణ్య నేతృత్వంలోని బృందం పాండియన్‌పై కన్నేసింది. ఈ పరిస్థితుల్లో సోమవారం సాయంత్రం పాండియన్‌ రూంలో ఓ బృందం, శాలిగ్రామంలోని పాండియన్‌ ఇంట్లో మరో బృందం సోదాలు చేపట్టింది. రాత్రంతా ఈ సోదాలు సాగాయి. రెండో రోజు మంగళవారం కూడా తనిఖీలు సాగాయి. 

పాండియన్‌ కార్యాలయ గదిలో లక్షల కొద్ది నగదు, ఇంట్లో కట్టలు కట్టలుగా 1.5 కోట్ల నగదు బయటపడింది. రూ.7 కోట్లు విలువ చేసే 18 ఆస్తుల దస్తావేజులు చిక్కాయి. బీరువాల్లో 3 కేజీల బంగారు ఆభరణాలు, రూ. ఐదున్నర లక్షల విలువ చేసే వజ్రాలహారం, ఒకటిన్నర కేజీ వెండి వస్తువులు ఈ సోదాల్లో బయట పడ్డాయి. 

ఈ ఆస్తులు ఎలా సంపాదించారన్న విషయంగా పాండియన్‌ మీద ఏసీబీ విచారణ సాగుతోంది. 

మరోవైపు ఈరోడ్‌లోని  శ్రీపతి అసోసియేట్స్‌పై ఐటీ దాడులు సాగాయి. ఈ సంస్థ ప్రభుత్వ భవనాల నిర్మాణాలతోపాటు పలు, ప్రైవేటు సంస్థల నిర్మాణాలు చేపట్టింది. పన్ను ఎగవేత సమాచారంతో ఆదివారం రాత్రి నుంచి ఈసంస్థ కార్యాలయాలు, యజమానుల ఇళ్లల్లో ఐటీ సోదాలు సాగుతున్నాయి.

 ఇప్పటి వరకు రూ.16 కోట్లు విలువ చేసే నగదు, ఆస్తుల దస్తావేజులు బయట పడ్డట్టు ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. గత వారం చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు ప్రాంతాల్లో ఐటీ వర్గాలు సాగించిన దాడుల్లో రూ. 23 కోట్ల నగదు, రూ. 110 కోట్లు విలువ చేసే ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల్ని సీజ్‌ చేసినట్టు ఆ కార్యాలయం ఢిల్లీలో విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.  

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !