
భారత అంతరిక్ష పరిశోధన ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగానికి మధ్యలో బ్రేకులు పడ్డాయి. ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని పైకి చేరింది అన్న విషయం నిర్దారణ అయినప్పటికీ... దాని నుంచి ఎలాంటి సంబంధాలు లేకపోవడంతో శాస్త్రవెత్తలు అయోమయంలో పడ్డారు. సంబంధాలను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ... పెద్దగా ప్రయోజనం కలగలేదు. దీంతో రంగంలోని నాసా దిగింది.
విక్రమ్ నుంచి స్పం దన కోసం డీప్స్పేస్ నెట్వర్క్ సెంటర్ల ద్వారా, జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ ద్వారా రేడి యో సంకేతాలు పంపుతోంది. అంతేకాదు.. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో ఉన్న నాసా ‘లూనార్ ఆర్బిటర్’ ఈ నెల 17న ల్యాండర్ ఉన్న వైపునకు వెళ్లనుంది. ఆ సమయంలో అది ఫొటోలు తీస్తుందని శాస్త్రజ్ఞులు వివరించారు. ఆ చిత్రాలను ఇస్రోతో పంచుకుంటామని నాసా అధికార ప్రతినిధి తెలిపారు. ఇంతకీ విక్రమ్పై నాసా ఎందుకింత ఆసక్తి చూపుతోందనే ప్రశ్నకు ఒక కారణముంది.
అదేంటంటే.. ల్యాం డర్ విక్రమ్లో అమర్చిన పరికరాల్లో నాసా గొడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్కు చెందిన ‘లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ యారే’ కూడా ఉంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి 2024లో వ్యోమగాములను పంపేందుకు నాసా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు నాసా ఈ ఎల్ఆర్ఏను ల్యాండర్లో చేర్చింది. కానీ, విక్రమ్ నుంచి చివరక్షణంలో సంకేతాలు ఆగిపోవడంతో ల్యాండర్తో సంబంధాల పునరుద్ధరణకు నాసా కృషి చేస్తోంది.
మరోవైపు మన ఇస్రో కూడా విక్రమ్తో సంబంధాల పునరుద్ధరణ కోసం బెంగళూరు సమీపంలోని బైలాలు డీప్స్పేస్ నెట్వర్క్ నుంచి సంకేతాలు పంపుతోంది. ఈ నెల 20-21 తేదీల దాకా తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని, విక్రమ్ చంద్రుడిపై ఉన్న ప్రాంతంలో అప్పటిదాకానే వెలుగు (చంద్ర పగలు) ఉంటుందని ఇస్రో అధికారి ఒకరు తెలిపారు.