కాంటాక్ట్ ట్రేసింగ్ నిల్, యాంటీ జెన్ టెస్టులే దిక్కు: కేరళలో పరిస్ధితి ఇదీ, కేంద్రానికి నిపుణుల బృందం నివేదిక

By Siva KodatiFirst Published Aug 4, 2021, 4:37 PM IST
Highlights

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను కేరళలో అస్సలు పాటించట్లేదని కేంద్ర ప్రభుత్వ బృందం తేల్చింది. హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్లను సరిగ్గా పర్యవేక్షించట్లేదని సెంట్రల్ టీమ్ అసహనం వ్యక్తం చేసింది

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ కేరళలలో మాత్రం భారీగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో సగం ఆ రాష్ట్రం నుంచే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ పరిస్ధితులు, నియంత్రణకు సంబంధించి  నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ)కి చెందిన ఆరుగురు సభ్యుల టీమ్ ను కేంద్రం గత వారం కేరళకు పంపించిన సంగతి తెలిసిందే. ఈ బృందం పరిశీలనలో అనేక వాస్తవాలు వెలుగుచూశాయి.

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను కేరళ అస్సలు పాటించట్లేదని, హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్లను సరిగ్గా పర్యవేక్షించట్లేదని కేంద్ర బృందం అసహనం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖకు తెలిపింది. కరోనా బారిన పడిన 90 శాతం మంది బాధితులు హోం ఐసోలేషన్ లోనే ఉంటున్నారని కేంద్ర బృందం తన నివేదికలో పేర్కొంది. అయితే, హోం ఐసోలేషన్ నిబంధనలను సరిగ్గా అమలు చేయట్లేదని, అందువల్ల రాష్ట్రంలో ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.

ALso Read:ఇండియాలో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు: రికవరీ కంటే కొత్త కేసులే అధికం

కరోనా సోకినవారి కాంటాక్ట్‌ల గుర్తింపూ చాలా అధమ స్థాయిలో ఉందని కేంద్ర బృందం ఆక్షేపించింది. 1:20గా ఉండాల్సిన కాంటాక్ట్ ట్రేసింగ్.. కేవలం 1:1.5 గానే ఉందని దుయ్యబట్టింది. ఆర్టీపీసీఆర్ టెస్టులను చాలా తక్కువగా చేస్తున్నారని, 80 శాతం వరకు యాంటీజెన్ టెస్టులపైనే ఆధారపడుతున్నారని తెలిపింది. కంటెయిన్ మెంట్, మైక్రో కంటెయిన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేసినా.. ఎక్కడా కేంద్ర నిబంధనలను అనుసరించలేదని సెంట్రల్ టీమ్ తన నివేదికలో పేర్కొంది. చాలా వరకు ఆ జోన్ల చుట్టుపక్కల బఫర్ జోన్లను ఏర్పాటు చేయలేదని తెలిపింది. 

కాగా, మంగళవారం ఒక్కరోజే కేరళలో 20 వేల కేసులు నమోదవ్వగా.. 148 మంది చనిపోయారు. పాజిటివిటీ రేటు 11.48 శాతంగా ఉంది. రోజూ కేసులు పెరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. కేవలం ఆదివారాల్లోనే లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఇవాళ ప్రకటించారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో అన్ని షాపులూ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. పాజిటివిటీ రేటు వెయ్యికి పదిగా ఉంటే ఆయా చోట్ల ట్రిపుల్ లాక్ డౌన్ అమల్లో ఉంటుందని వీణా జార్జ్ చెప్పారు
 

click me!