
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) 10, 12 వ తరగతుల టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26 నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను సీబీఎస్ఈ బోర్టు శుక్రవారం ప్రకటించింది. 10వ తరగతి పరీక్షలు మే 24వ తేదీన ముగియనుండగా.. 12వ తరగతి పరీక్షలు జూన్ 15న ముగియనున్నాయి. పరీక్షలను ఆఫ్ లైన్ మోడ్లోనే నిర్వహించనున్నట్టుగా సీబీఎస్ఈ బోర్డు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. సీబీఎస్ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ cbse.gov.in, cbse.nic.in వెబ్సైట్స్లో అందుబాటులో ఉంచినట్టుగా బోర్టు తెలిపింది.
ఇక, కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో 2021-2022 విద్యా సంవత్సరం 10,12 తరగతుల బోర్డు పరీక్షలను రెండు టర్మ్లుగా నిర్వహించాలని సీబీఎస్ఈ బోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ గతేడాది నవంబర్, డిసెంబరులలో పూర్తి అయ్యాయి. ఇప్పుడు టర్మ్ 2 పరీక్షల షెడ్యూల్ను సీబీఎస్ఈ బోర్టు విడుదల చేసింది. సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్లో ఉండే సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని బోర్డ్ విద్యార్థులకు సూచించింది.
కాగా.. 10, 12 తరగతి పరీక్షల నమూనాలో ఎలాంటి మార్పులు ఉండబోవని జనవరిలోనే సీబీఎస్ఈ ప్రకటించింది. వెబ్సైట్లో ఉంచిన శాంపిల్ పేపర్స్ మాదిరిగానే ప్రశ్నాపత్రాలు ఉంటాయని తెలిపింది. ఇక, సిలబస్ విషయంలో కూడా బోర్డు క్లారిటీ ఇచ్చింది. కరోనా పరిస్థితుల వల్ల టర్మ్-2 పరీక్షల కోసం సిలబస్ను హేతుబద్దీకరించినట్లు పేర్కొంది. మరోవైపు జేఈఈ మెయిన్స్ వంటి ఇతర పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని డేట్ షీట్ను రూపొందించినట్లు సీబీఎస్ఈ తెలిపింది.
ఇక, CBSE 10,12 తరగతుల బోర్డు పరీక్షలు భారతదేశంతో పాటు మరో 26 దేశాల్లో నిర్వహించనున్నట్టుగా సీబీఎస్ఈ బోర్డు తెలిపింది. అందువల్ల పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని పరీక్షలు ఒకే షిఫ్ట్లో మాత్రమే నిర్వహించనున్నట్టుగా పేర్కొంది.