
Salman Khurshid: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వతంత్య్రంగా వ్యవహరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ శనివారం సూచించారు. తన సూచనకు మద్దతుగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన ఉదహరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలు స్వతంత్య్రంగా వ్యవహరించాలని, సీజేఐ కూడా చెప్పారని, ఏదో తప్పు జరుగుతుందని, తాను గమనించినట్లయితే తప్ప చెప్పలేదని అన్నారు. ఏదో తప్పు జరుగుతోందని, ప్రజలు బీజేపీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారని మేమంతా నమ్ముతున్నామని ఆయన అన్నారు.
గత నెలలో CJI రమణ మాట్లాడుతూ.. CBI నిష్క్రియాత్మకతంగా ఉందనీ, కొన్ని సందర్భాల్లో ఇలాంటి.. ప్రశ్నలు వస్తే.. కాలం గడిచే కొద్దీ దాని విశ్వసనీయతపై ప్రజల సందేహం వ్యక్తమవుతోందని అన్నారు. వివిధ దర్యాప్తు సంస్థలను ఒకే తాటిపైకి తీసుకురావడానికి "స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ"ను రూపొందించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.
ఇంతలో.. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభం నెలకొందా? అని ప్రశ్నించగా.. సల్మాన్ ఖుర్షీద్ ఆ ప్రశ్నకు బదులిస్తూ.. దేశ రాజకీయాల్లోనే ఓ సంక్షోభముంది. కానీ, కాంగ్రెస్ నాయకత్వంలో ఎలాంటి సంక్షోభమూ లేదని పేర్కొన్నారు. మాకు మా నాయకత్వంపై నమ్మకం ఉంది. మేము మా నాయకులకు కట్టుబడి ఉన్నాము వారినే ఆరాధిస్తామని అన్నారు. కొన్ని ఓటములను తాము చూస్తున్న మాట వాస్తవమేనని, అయినంత మాత్రాన పార్టీ బలహీనపడలేదని స్పష్టం చేశారు.
జీ 23 గ్రూపు విషయంలో తమకు ఎలాంటి భయమూ లేదని తేల్చి చెప్పారు. తామే జీ 500, జీ 1000, జీ 2000 గా వున్నామని, ఆ గ్రూపు అంటే భయం లేదన్నారు. సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్రగా వ్యవహరించాలని, ఇదే విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి కూడా ఉటంకించారని ఈయన గుర్తు చేశారు. దేశంలో ఏదో జరుగుతోందని, బీజేపీలో చేరాలని కొందరి నేతలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని ఆరోపించారు.
ఇదే సమయంలో బీజేపీపై విమర్శాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టడమంటే.. దేశాన్ని, ప్రజలను దోచుకునేందుకు లైసెన్స్ పొందినట్టుగా బీజేపీ భావిస్తున్నదనీ, ప్రధాని మోదీ దేశాన్ని దోచుకు తింటున్నారని ఆరోపించారు. దేశంలో పెరుగుతున్న ధరలను తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదనీ, ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరల పెంపును ప్రజలకు బహుమతిగా ఇస్తున్నదని కీలక వ్యాఖ్యలు చేశారు.