యూపీఎస్సీ సిలబస్‌ వివాదం: బైజూస్‌ రవీంద్రన్‌పై ఎఫ్‌ఐఆర్‌

By Siva KodatiFirst Published Aug 5, 2021, 3:36 PM IST
Highlights

బైజూస్ కంపెనీ యజమాని రవీంద్రన్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. బైజూస్ కంపెనీ యూపీఎస్‌సీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించిందని క్రిమియోఫోబియా వ్యవస్థాపకుడు స్నేహిల్ ధాల్ ఆరోపించారు.

దేశంలోని ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ కంపెనీ యజమాని రవీంద్రన్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీఎస్సీ సిలబస్‌‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని  అందించారనే ఆరోపణలతో  ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. క్రిమోఫోబియా అనే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద రవీంద్రన్‌పై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. 

బైజూస్ కంపెనీ యూపీఎస్‌సీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించిందని క్రిమియోఫోబియా వ్యవస్థాపకుడు స్నేహిల్ ధాల్ ఆరోపించారు. యుపీఎస్‌సీ ప్రిపరేటరీ మెటీరియల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ను యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ట్రాన్స్‌నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ (యుఎన్‌టీఓసీ)కి నోడల్ ఏజెన్సీగా పేర్కొన్నట్లు తెలిపారు. ఈ విషయాన్నిగమనించిన వెంటనే కంపెనీకి అవసరమైన మార్పులు చేయమని కోరుతూ ఒక ఇ-మెయిల్ పంపామని స్నేహిల్ ధాల్ అన్నారు.  అయితే  బైజూస్‌ సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్టు ఆయన తెలిపారు.

మరోవైపు ఈ ఫిర్యాదుపై బైజూస్‌ స్పందించింది. ఎఫ్‌ఐఆర్‌ కాపీని తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని వెల్లడించారు. అలాగే క్రిమియోఫోబియా లేఖను కూడా ధృవీకరించిన సంస్థ తాము అందించిన మెటీరియల్ వాస్తవంగా సరైందనని భావిస్తున్నామన్నారు.  దీనికి సంబంధించి హో మంత్రిత్వ శాఖ జారీ చేసిన బహిరంగంగా అందుబాటులో ఉన్న 2012, ఏప్రిల్ 30 నాటి అధికారిక కాపీని క్రిమియోఫోబియాకు షేర్‌ చేసినట్టు బైజూస్ యాజమాన్యం వెల్లడించింది. 
 

click me!