రోడ్డు ప్రమాదంలో యువ‌కుడి మృతి… కోపోద్రిక్తులైన స్థానికులు.. బస్సుకు నిప్పు 

By Rajesh KarampooriFirst Published Sep 18, 2022, 10:54 PM IST
Highlights

ప్రమాదంలో ఓ వ్య‌క్తి మరణించడంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన స్థానికులు బస్సుకు నిప్పు పెట్టారు. దీంతో  భద్రతా కారణాల దృష్ట్యా ఈ మార్గంలో బస్సు సర్వీసులను 48 గంటలపాటు నిలిపివేసినట్లు సిక్కిం ప్రభుత్వ అధికారులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఓ యువ‌కుడు మరణించాడు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు బస్సుకు నిప్పంటించారు. ఈ ఘ‌ట‌న పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో జరిగింది. వివ‌రాల్లోకెళ్లే.. సిక్కిం రవాణా శాఖకు చెందిన  ఒక బస్సు ఆదివారం మధ్యాహ్నం 3 గంట‌ల ప్రాంతంలో బెంగాల్ సఫారీ పార్క్ సమీపంలో మరో బస్సును ఓవర్‌ టేక్‌ చేయబోయి.. ఎదురుగా వ‌స్తున్న బైక్ ను ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై వస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయ‌ప‌డి అక్కడికక్కడే మరణించాడు.

ఘ‌ట‌న‌లో మృతిచెందిన వ్య‌క్తిని సచిన్ ఛెత్రిగా గుర్తించారు. అతను తన బైక్ పై సాలుగార నుండి సెవోకే వద్ద ఉన్న తన ఇంటికి తిరిగి వస్తుండగ.. బస్సును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఎదురుగా వస్తున్న బస్సు అతనిని ఢీకొట్టింది. ఛెత్రీ అక్కడికక్కడే మరణించాడ‌ని స్థానికులు తెలిపారు.

ఈ ఘ‌ట‌న చూసిన స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో ఆ బస్సుకు నిప్పంటించారు. స‌మాచారం తెలుసుకున్న అగ్నిమాప‌క సిబ్బంది.. మంటలు ఆర్పేందుకు ఘ‌ట‌న‌కు వ‌చ్చే వారిని కూడా స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ బస్సు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో జాతీయ రహదారి 31పై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై సుమారు  రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.  మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా ఈ మార్గంలో బస్సు సర్వీసులను 48 గంటలపాటు నిలిపివేసినట్లు సిక్కిం ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.

click me!