ప్రేమకు లాక్ డౌన్ బ్రేక్: ప్రేయసిని చంపి పరారైన యువకుడు

By telugu teamFirst Published Jul 19, 2020, 7:01 AM IST
Highlights

తమిళనాడులోని కోయంబత్తూర్ లో దారుణం జరిగింది. లాక్ డౌన్ కారణంగా ప్రేమకు విఘాతం కలగడంతో ఓ యువకుడు తన ప్రేయసిని చంపేసి పరారయ్యాడు. దాడిలో ఆమె తండ్రి కూడా గాయపడ్డాడు.

చెన్నై: కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా ఓ హత్య చోటు చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా తనను కలుసుకోవడానికి నిరాకరించిన ప్రేయసిపై ఓ యువకుడు దాడి చేసి హత్య చేశాడు. అడ్డు వచ్చిన ఆమె తండ్రిపై కూడా దాడి చేశాడు.  ఆ తర్వాత పారిపోయాడు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ సంఘటన జరిగింది.

కోయంబత్తూరులోని ఎంఆర్ గార్డెన్ కు చెందిన శక్తి వేల్ కూతురు ఐశ్వర్య (18) పేరూరులోని ప్రైవేట్ కళాశాలలో చదువుతోంది. ఎంఆర్ గార్డెన్ కు చెందిన రితీష్ (24)తో ఐశ్వర్య ప్రేమలో పడింది. అయితే, లాక్ డౌన్ కారణంగా ఇటీవలి కాలంలో వారిద్దరు కలుసుకోవడం ఇబ్బందిగా మారింది. 

ప్రేయసిని చూడాలనే కోరికను అణచుకోలేక రితేష్ ఆమె ఇంటి వద్దకు వెళ్లాడు. దాంతో రితీష్ ను ఐశ్వర్య కుటుంబ సభ్యులు మందలించారు ఐశ్వర్యకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో ఐశ్వర్య ఇంటికే పరిమతమైంది. రితీష్ ఆమెతో మాట్లాడేందుకు విపరీతంగా ప్రయత్నించాడు. అయితే ఆమె పట్టించుకోలేదు. అతని ప్రేమను కూడా నిరాకరిస్తూ వచ్చింది. దీంతో కోపంతో రగిలిపోయిన రితీష్ శుక్రవారం రాత్రి 7 గంటలకు ఐశ్వర్య ఇంటికి వెళ్లాడు. 

రితీష్ ఐశ్వర్యను ప్రేమ గురించి నిలదీశాడు. నన్ను ప్రేమిస్తున్నావా, లేదా అని ప్రశ్నించింది. ఆమె అతని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. తాను ప్రేమించడం లేదని ఆమె చెప్పింది. దాంతో అతను ఉన్మాదిగా మారిపోయి వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. 

కూతురును కత్తితో పొడుస్తున్న రితేష్ ను అడ్డుకునేందుకు శక్తివేల్ ప్రయత్నించాడు. అతనిపై కూడా రితేష్ దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. శక్తివేల్ కేకలతో ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకున్నారు. తండ్రీకూతుళ్లను కోయంబత్తూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐశ్వర్య శనివారం మధ్యాహ్నం మరణించింది. పరారీలో ఉన్న రితేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

click me!