అసోం ఎన్నికలు: కొలిక్కివచ్చిన సీట్ల పంపకం.. 92 స్థానాల్లో బీజేపీ పోటీ...?

Siva Kodati |  
Published : Mar 05, 2021, 02:51 PM ISTUpdated : Mar 05, 2021, 02:52 PM IST
అసోం ఎన్నికలు: కొలిక్కివచ్చిన సీట్ల పంపకం.. 92 స్థానాల్లో బీజేపీ పోటీ...?

సారాంశం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాషాయ దళం.. వివిధ రాష్ట్రాల్లో పొత్తులు, సీట్ల పంపకం, అభ్యర్ధుల ఖరారుపై దృష్టి పెట్టింది.  దీనిలో భాగంగా ఈశాన్య రాష్ట్రం అసోంలో మిత్ర పక్షాలతో బీజేపీ సీట్ల పంపకం చివరి అంకానికి చేరింది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాషాయ దళం.. వివిధ రాష్ట్రాల్లో పొత్తులు, సీట్ల పంపకం, అభ్యర్ధుల ఖరారుపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా ఈశాన్య రాష్ట్రం అసోంలో మిత్ర పక్షాలతో బీజేపీ సీట్ల పంపకం చివరి అంకానికి చేరింది.

అన్ని భాగస్వామ్య పక్షాలతో పోటీ చేసే సీట్లపై ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 126 స్థానాలకు గానూ 92 సీట్లలో బీజేపీ పోటీ చేయనుంది. మిగిలిన 26 సీట్లలో అసోం గణ పరిషద్ (ఏజీపీ), 8 స్థానాల్లో యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) పోటీ చేయనున్నాయి.

కాగా, స్థానిక పార్టీ ఒకటి బీజేపీలో విలీనం అయిందని, ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరు అభ్యర్థులు బీజేపీ గుర్తుపైనే పోటీ చేస్తారని కమలనాథులు చెబుతున్నారు. ఇక, 84 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ సిద్ధం చేసిందని దీనిని ఈరోజు ప్రకటించే అవకాశం వుందని పార్టీ వర్గాల సమాచారం.

ఇక, ఏజీపీ వ్యవస్థాపకుడు, అసోంకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ప్రఫుల్ల కుమార్ మహంతకు ఈసారి టికెట్ దక్కే అవకాశాలు లేవని పార్టీ వర్గాల మాట. ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ప్రస్తుతం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో మహంత చికిత్స పొందుతున్నారు.

పౌరసత్వ చట్టంపై ఆయన వ్యతిరేక గళం వినిపించడంతో పార్టీలో భేదాభిప్రాయాలు వచ్చాయి. అయితే, ఎన్నికల లోపు ఆయన కోలుకుని పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటే.. కచ్చితంగా చీలిక వస్తుందన్న ఊహాగానాలు అసోంలో వినిపిస్తున్నాయి.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో 84 సీట్లలో పోటీ చేసిన బీజేపీ.. 60 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2011లో గెలిచిన స్థానాల కన్నా 55 ఎక్కువ స్థానాలను ఖాతాలో వేసుకోవడం విశేషం.
 

PREV
click me!

Recommended Stories

African Queen Ant Smuggling: చీమల స్మగ్లింగ్ వీటితో కోట్లు సంపాదన | Asianet News Telugu
CBSE కొత్త రూల్.. పిల్లలపై భారం తప్పదా? 3 భాషలు చదవాల్సిందేనా? | Asianet News Telugu