
Petrol and diesel price: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కారును టార్గెట్ చేసిన కాంగ్రెస్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న దేశంలో మాత్రం పెట్రోల్, ఢీజిల్ ధరలు తగ్గకుండా పెరుగుతున్నాయని పేర్కొంది. ఇంధనంతో బీజేపీ దోపిడి చేస్తోందని ఆరోపించింది. గత ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు 25 శాతం వరకు తగ్గినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలలో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తగ్గించలేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.
వివరాల్లోకెళ్తే.. అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధరలు 10 నెలల కనిష్టానికి చేరినప్పటికీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ఇంధన దోపిడీని కొనసాగిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ కూడా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్గా విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దేశంలో చమురు ధరలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. "మే 16, 2014న (ఢిల్లీ) బ్యారెల్ ముడి చమురు ధర 107.09 డాలర్లు. పెట్రోల్ - ₹71.51, డీజిల్ - ₹57.28గా ఉంది. డిసెంబర్ 1, 2022న బ్యారెల్కు క్రూడ్ అయిల్ ధర USD 87.55 గా ఉంది. ఇదే సమయంలో దేశంలో పెట్రోల్ ₹96.72, డీజిల్ ₹89.62గా ఉంది. క్రూడ్ అయిల్ ధరలు 10 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది, కానీ బీజేపీ దోపిడీ ఎక్కువగానే ఉంది! ఇంధన దోపిడీని ఆపండి" అని రాసి ఉన్న గ్రాఫిక్తో ట్వీట్ చేశారు.
గత ఆరు నెలల్లో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ రేట్లు 25% మేర తగ్గాయనీ, అయితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తగ్గించలేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం కేంద్రంపై విమర్శలు గుప్పించారు. "గత 6 నెలల్లో, ముడి చమురు 25% కంటే ఎక్కువ చౌకగా మారింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ₹10 కంటే ఎక్కువ తగ్గించవచ్చు, కానీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. భారత ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నారు. ప్రధానమంత్రి ఇవేవీ పట్టించుకోవడం లేదు.." అంటూ రాహుల్ గాంధీ హిందీ ట్వీట్లో పేర్కొన్నారు.